గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 20వేల మొక్కలు నాటిన ముఖార గ్రామస్తులు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 20వేల మొక్కలు నాటిన ముఖార గ్రామస్తులు

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆదిలాబాద్ గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖార (కె) గ్రామస్తులు పెద్దఎత్తున ఈ ఛాలెంజ్‌లో పాల్గొని 20 వేల మొక్కలు నాటినట్లు సర్పంచ్ మినాక్షి ఘడ్కే తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా గ్రామస్తులు గతంలో 80 వేల మొక్కలు నాటినట్లు చెప్పుకొచ్చారు. మొక్కలను కాపాడేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నందున వాటి మనుగడ రేటు 100 శాతంగా ఉందని ఆమె తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఎంపీటీసీ సుభాష్ గడ్కే, గ్రామస్తులు పాల్గొన్నారు.

 'తెలంగాణకు హరితహారం' స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్‌ నాలుగేళ్ల క్రితం హరితహారంపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు. అందులో భాగంగా యాదాద్రి నేచురల్ ఫారెస్ట్ (వైఎన్‌ఎఫ్) తరహాలో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ సహకారంతో అడవులు అంతరించి పోయిన గొల్లూరులో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే పనిని చేపట్టింది. మొదటి దశలో ఇప్పటికే 900 ఎకరాల అటవీ ప్రాంతంలో ఫెన్సింగ్‌ను పూర్తి చేశారు. అటవీ విస్తీర్ణాన్ని పునరుద్ధరించడానికి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0 కింద ఒకేసారి 10,000 పెద్ద మొక్కలను నాటారు. సద్గురు, ఆయన మద్దతుదారులు, ఇషా ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల విద్యార్థులు, స్థానికులు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.