
హయత్నగర్లో కూతురు తన తల్లిని ప్రియుడితో కలిసి చంపిన ఘటన రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం కలిగించింది. తాజాగా అటువంటి ఘటనే ముంబైలోనూ జరిగింది. దత్తత తీసుకొని పెంచుకుంటున్న తండ్రిని బాయ్ఫ్రెండ్తో కలిసి ఓ దత్తపుత్రిక చంపి ముక్కలు చేసింది. గత సోమవారం ముంబైలోని మహీమ్ బీచ్లో ఓ వ్యక్తి మృతదేహం సూట్కేసులో లభించింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బీచ్లో దొరికిన మృతదేహాన్ని పోలీసులు పరిశీలించగా.. సూట్కేసులో షర్ట్, స్వెటర్, మరియు ప్యాంటు లభించాయి. షర్ట్పై ‘ఆల్మోస్ మెన్స్వేర్’ అనే షాపు పేరు ఉంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు.. కుర్లా వెస్ట్లోని బెల్గామి రోడ్లో ఉన్న టైలరింగ్ షాపు యజమానిని సంప్రదించగా ఆ చొక్కా బెన్నెట్ రెబెల్లో అనే వ్యక్తి పేరు మీద ఉన్న రశీదు లభించింది. ఆ సమాచారంతో పోలీసులు ఫేస్బుక్లో వెతకగా.. బెన్నెట్ ఫేస్బుక్ ఐడీ దొరికింది. అందులో బెన్నెట్ శాంటా క్రూజ్ ఈస్ట్లో ఉంటున్న ఫ్లాట్ అడ్రస్ ఉంది. అతను సంగీత ప్రదర్శనలు ఇచ్చే వాడని ఫేస్బుక్ ద్వారా తెలిసింది. రశీదు మీద ఉన్న సంతకం, ఫేస్బుక్ సంతకం రెండూ మ్యాచ్ కావడంతో మృతదేహం బెన్నెట్దేనని కన్ఫర్మ్ అయింది.
ఫేస్బుక్లో దొరికిన సమాచారంతో బెన్నెట్ ఇంటి అడ్రస్కు వెళ్లి దర్యాప్తు చేయగా.. ఆ ఇంట్లో ఆయన కూతురు ఆరాధ్య జితేంద్ర పాటిల్ అలియాస్ రియా బెన్నెట్ రెబెల్లో ఉంది. ఆమెను తండ్రి గురించి అడుగగా.. తన తండ్రి కెనడాలో ఉన్నట్లు చెప్పింది. కానీ, పోలీసులు అనుమానంతో పదేపదే అడుగగా.. తన తండ్రిని బాయ్ఫ్రెండ్తో కలిసి చంపినట్లు ఒప్పుకుంది.
బెన్నెట్ రెబెల్లో తన సొంత తండ్రి కాదని, అతడు ఆమెను దత్తత తీసుకున్నట్లు ఆరాధ్య తెలిపింది. తనపై తండ్రి లైంగిక వేధింపులు చేసేవాడని, అది భరించలేకే బాయ్ఫ్రెండ్తో కలిసి చంపానని ఆమె చెప్పింది. నవంబర్ 26న తండ్రి తలపై కర్రతో కొట్టి, ఆ తర్వాత కత్తితో పొడిచి చంపినట్లు ఆమె తెలిపింది. అంతేకాకుండా.. మృతదేహాన్ని ఫ్లాట్లో తమతో పాటు మూడు రోజులు ఉంచుకొని, ఆ తర్వాత ముక్కలు ముక్కలు చేసి సూట్కేసులో పెట్టి వకోలా సమీపంలోని మిథి నదిలో పడేసినట్లు తెలిపింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నిందితులు ఇద్దరూ మైనర్లే కావడం. పోలీసులు ఆరాధ్యతో పాటు ఆమె బాయ్ఫ్రెండ్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం..