న్యూఢిల్లీ: “అబ్ కీ బార్ మోదీ సర్కార్” వంటి యాడ్ స్లోగన్స్ను క్రియేట్ చేసిన ప్రముఖ యాడ్ డిజైనర్ పీయూష్ పాండే (70) శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. 1982లో ఆగ్లివి ఇండియాలో చేరిన ఆయన, స్థానిక భాష, హాస్యం, భావోద్వేగాలతో భారతీయ ప్రకటనల శైలిని మార్చారు.
క్యాడ్బరి “కుచ్ ఖాస్ హై(ఏదో ప్రత్యేకత ఉంది)’’, ఏషియన్ పెయింట్స్ “హర్ ఖుషీ మే రంగ్ లాయే (ప్రతి ఆనందంలో రంగులు నింపుతుంది)” వంటి యాడ్ స్లోగన్లను, ఫేమస్ ఫెవికాల్ యాడ్ (ఎగ్ ఫిల్మ్)ను క్రియేట్ చేశారు. 2016లో పద్మశ్రీ, 2024లో లండన్ లెజెండ్ అవార్డు అందుకున్నారు. 2004లో కేన్స్ లయన్స్ జ్యూరీకి అధ్యక్షత వహించిన తొలి ఆసియన్లలో ఒకరిగా నిలిచారు.
ఆయన రంజీ క్రికెట్ ట్రోపీలో రాజస్తాన్ తరపున ఆడారు కూడా. పీయూష్ పాండే చనిపోయిన విషయాన్ని సోదరి ఇలా అరుణ తెలిపారు. ప్రధాని మోదీ, గౌతమ్ అదానీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, ఆనంద్ మహీంద్రా, ఉదయ్ కోటక్ తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. శనివారం ఉదయం శివాజీ పార్క్లో అంత్యక్రియలు
జరగనున్నాయి.
