పస్తాపూర్​ సభ: 2014 తరువాత నిమ్జ్​ అభివృద్ది కుంటుపడింది

పస్తాపూర్​ సభ: 2014 తరువాత నిమ్జ్​ అభివృద్ది కుంటుపడింది

మెదక్​ జిల్లాకు ఇందిరమ్మకు విడదీయరాని బంధం ఉందని పస్తాపూర్​ సభలో సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.  మెదక్​ ఎంపీ గానే ఇందిరాగాంధీ అమరులయ్యారన్నారు.  జహీరాబాద్​ నియోజకవర్గ అభివృద్దికి కట్టుబడి ఉన్నామని.. గేట్​ వే ఆఫ్​ ఇండస్ట్రీస్​ గా జహీరాబాద్​ కావాలని కృషి చేస్తామన్నారు. 2014 తరువాత నిమ్జ్​ అభివృద్ది కుంటుపడిందని.. భూమి కోల్పోయిన 5 వేల 612 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని....  వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చే బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు.  

జహీరాబాద్​ పారిశ్రామిక వాడ అభివృద్ది గురించి మాట్లాడుతూ... గీతారెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు నిమ్జ్​ సాధించామన్నారు.  జహీరాబాద్​ అభివృద్దిలో గీతారెడ్డి కీలకపాత్ర  పోషించారంటూ... పారిశ్రామిక వాడ భూసేకరణలో రైతులకు అన్యాయం  జరిగిందని నా దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్​ తెలిపారు.  నిమ్జ్​ లో హుందాయ్​ కార్ల ఫ్యాక్టరీ రాబోతుందని తెలిపారు. 

నిమ్జ్​ కోసం భూమి ఇచ్చిన వారికి న్యాయం చేస్తామని... సింగూరు ప్రాజెక్ట్​ ను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు.  ఇక రైతుల పంట విషయం గురించి మాట్లాడుతూ... ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్​  వరి వేస్తే ఉరి అన్నారని... కాని కాంగ్రెస్​ ప్రభుత్వంలో వరిపండించిన వారికి రూ.  500 బోనస్​ ఇస్తున్నామన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతకు పదేళ్లుగా ఉద్యోగాలు లేవని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కోసం చర్యలు తీసుకుంటున్నామని.. మీ అందరూ అండగా ఉంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు.  బసవేశ్వరుడి సందేశం అనుసరించి, ప్రతి వర్గానికి సముచిత భాగస్వామ్యం కల్పించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు రేవంత్‌ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యానికి బసవేశ్వరుని సందేశం మానవతా విలువలపై ఆధారపడి ఉన్న సూచికగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖలు, ఎంపీ సురేష్ షెట్ల్ కార్ పాల్గొన్నారు.