కాంగ్రెస్​ పార్టీలో పంచాది తెగలే

కాంగ్రెస్​ పార్టీలో  పంచాది తెగలే

హైదరాబాద్, వెలుగు : ఏఐసీసీ దూతగా దిగ్విజయ్​సింగ్​ రాష్ట్రానికి వచ్చి మూడు రోజులు మకాం వేసినా రాష్ట్ర కాంగ్రెస్​ నేతల మధ్య పంచాది తెగలేదు. నాయకుల అభిప్రాయాలు తీసుకున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు. తన రిపోర్ట్​ను ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేయనున్నట్లు తెలిసింది. ఆ రిపోర్టు ఆధారంగా  కాంగ్రెస్​ హై కమాండ్​ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్నాళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్​లో రేవంత్​రెడ్డి వర్గం, సీనియర్ల మధ్య లొల్లి నడుస్తున్నది. పీసీసీ కమిటీల ప్రకటనతో ముదిరిన లొల్లి అనేక అంశాలపైకి మళ్లింది. రెండు వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడంపై కాంగ్రెస్​ హైకమాండ్​ ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. నేతలను ఢిల్లీకి పిలిచి పంచాయితీని పరిష్కరిస్తుందని  తొలుత భావించినా అనూహ్యంగా దిగ్విజయ్​సింగ్​ను అబ్జర్వర్​గా రాష్ట్రానికి పంపుతున్నట్లు సోమవారం ప్రకటించింది. వెంటనే ఆయన ఏఐసీసీ రాష్ట్ర ఇన్​చార్జులతో,  తర్వాత పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డితో ఢిల్లీలోనే మాట్లాడారు. 

మరుసటి రోజు మరికొందరు రాష్ట్ర నేతలతో మాట్లాడి సీనియర్ల భేటీ వాయిదా వేయించారు. బుధవారం సాయంత్రం స్వయంగా హైదరాబాద్​కు వచ్చిన దిగ్విజయ్​సింగ్​ రాత్రి కొందరు లీడర్లను కలుసుకున్నారు. కాగా గురువారం రోజు మొత్తం గాంధీభవన్​లో ఉండి.. 40 మంది వరకు నేతలతో మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. శుక్రవారం ప్రెస్​మీట్​ పెట్టి ఢిల్లీకి వెళ్లిపోయారు. ప్రెస్​మీట్​లో దిగ్విజయ్​సింగ్​ మాట్లాడుతూ కాంగ్రెస్​లో చిన్న చిన్న విభేదాలు ఉంటాయని, వాటిని అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించినట్లు చెప్పారు. విభేదాలతో మీడియా ముందుకు వస్తే ఎంత పెద్ద లీడర్​ అయినా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. దిగ్విజయ్​ మాటలను బట్టి ఆయన విషయాన్ని మరీ అంత సీరియస్​గా తీసుకోలేదని, అయితే వివాదాన్ని పరిష్కరించేందుకు  ఒక మార్గం చూపుతారని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు. రాష్ట్రం ఇచ్చిన పార్టీ అయినప్పటికీ రెండు పర్యాయాలు అధికారానికి దూరమైందని, ఇప్పుడు ప్రజలకు పార్టీని దగ్గర చేయాలని దిగ్విజయ్​ సూచించినట్లు నేతలు తెలిపారు. 

ఒకటీ రెండు రోజుల్లో హైకమాండ్​కు రిపోర్ట్​!

వాస్తవానికి దిగ్విజయ్​ సింగ్​కు 2 వర్గాలు ఫిర్యాదు​ చేశాయి. రేవంత్​ను మార్చాలని వ్యతిరేక వర్గీయులు,  రేవంత్​ లేకుంటే పార్టీనే లేదని అనుకూలవర్గం చెప్పినట్లు తెలిసింది. సీనియర్లని చెప్పుకుంటున్న చాలా మంది కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని అనుకూల వర్గం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అందరి అభిప్రాయాలు విన్న దిగ్విజయ్​ ఒకట్రెండు రోజుల్లో హైకమాండ్​కు తన నివేదిక సమర్పిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్య నేతల అంచనా ప్రకారం రాష్ట్ర ఇన్​చార్జ్​ మార్పు లేదా ముగ్గురు, నలుగురు సభ్యులతో హైపవర్​ కమిటీని వేసే అవకాశాముంది. 

బీఆర్​ఎస్​, బీజేపీ నడుమ లోపాయికారీ ఒప్పందం: దిగ్విజయ్​ 

కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కొన్ని కారణాలతో అధికారంలోకి రాలేకపోయిందని, అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ మాత్రం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కారని కాంగ్రెస్​ సీనియర్​ నేత దిగ్విజయ్​సింగ్​ అన్నారు. గాంధీభవన్​లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  బీజేపీతో తలపడుతున్నట్లు బీఆర్​ఎస్​ నటిస్తూనే పార్లమెంట్​లో బిల్లులపుడు  సమర్థిస్తుందోన్నారు. ఆ 2 పార్టీల నడుమ లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు.  రాష్ట్రంలో బీర్ఎస్​, దేశంలో బీజేపీ.. కాంగ్రెస్​ నేతల్ని కొంటోందన్నారు. ‘‘కేసీఆర్​ ఎంఐఎం దోస్తానా వదులుకోరు. ఆ పార్టీ కూడా అంతిమంగా బీజేపీని గెలిపించే రీతిలోనే వ్యవహరిస్తుంది” అని దుయ్యబట్టారు. ముస్లింలకు కాంగ్రెస్​ ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్​ ఇచ్చిందని, కేసీఆర్​ 12 శాతం ఇస్తానని చెప్పి మొండి చెయ్యి చూపారని విమర్శించారు.