
- స్టాక్ మానిప్యులేషన్ కేసులో చిక్కుకున్న వ్యక్తి
- రూ. 5 లక్షల సెబీ ఫైన్
- తన సంతకం ఫోర్జరీ చేశారని వెల్లడి
న్యూఢిల్లీ: ‘స్టాక్ మార్కెట్ పరిచయం లేదు. డీమాట్, ట్రేడింగ్ అకౌంట్ అంటే తెలీదు. కానీ, స్టాక్ మానిప్యులేషన్ జరిపావని సడెన్గా సెబీ నుంచి ఆర్డర్స్ వస్తే ఏం చేస్తారు? రూ.5 లక్షల ఫైన్ విధిస్తే ఎక్కడికి పోతారు?’..ఇలాంటి సంఘటనే సంతోష్ మారుతి పాటిల్ జీవితంలో చోటు చేసుకుంది. తాను నిర్ధోషినని నిరూపించుకోవడానికి సెబీ, పోలీసులు, సుప్రీం కోర్టు, సెక్యూరిటీ అప్పిలెట్ ట్రిబ్యునల్ వరకు ఆయన వెళ్లారు. చివరికి ఈ ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. సంతోష్ మారుతి 2009 మే నుంచి 2010 ఏప్రిల్ మధ్య తన ట్రేడింగ్ అకౌంట్ ద్వారా స్టాక్ మానిప్యులేషన్కు పాల్పడ్డాడని సెబీ 2013 లో షోకాజ్ నోటీసులు పంపింది. ఓ కంపెనీ షేరు ధరను రూ. 41 నుంచి రూ.122.65 వరకు సింక్రనైజ్డ్ ట్రేడింగ్ ద్వారా మానిప్యులేట్ జరిపారని ఈ నోటీసులో పేర్కొంది. తనకు ట్రేడింగ్ అకౌంట్ అంటూ ఒకటి ఉందని ఆయన అప్పుడే మొదటిసారిగా తెలుసుకున్నారు. ఆయన శాలరీ అకౌంట్ను బ్యాంక్ 2015 లో ఫ్రీజ్ చేసింది. బ్యాంక్ మేనేజర్ ఈ విషయం చెప్పిన తర్వాత తాను మోసానికి గురయ్యాననే విషయం ఆయనకు పూర్తిగా అర్థం అయ్యింది.
చివరికి..
ట్రేడింగ్, డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సంతోష్ మారుతి సెబీ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఈ విషయాన్ని నిర్ధారించారు కూడా. అదే టైమ్లో ఆయన సెక్యూరిటీ అప్పిలెట్ ట్రిబ్యునల్ (శాట్) వద్దకు వెళ్లారు. సెబీ రూ.5 లక్షల ఫైన్ వేయడంపై మరోసారి ఆలోచించాలని 2015 లో శాట్ తీర్పిచ్చింది. 2020 లో ఈ ఫైన్ అమౌంట్ను రూ.3 లక్షలకు సెబీ తగ్గించింది. ఆ తర్వాత సంతోష్ మారుతి ఈ విషయంపై 2022 నవంబర్లో సుప్రీం కోర్టు డోర్ తట్టారు. సెబీ తన నిర్ణయాన్ని పరిశీలించుకోవాలని కోర్టు తీర్పిచ్చింది. కానీ, ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. సంతోష్ మారుతి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. దీంతో గతంలో వేసిన రూ. 3 లక్షల ఫైన్ను కొనసాగిస్తూ 2022 డిసెంబర్లో సెబీ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత ఆయన మళ్లీ శాట్ వద్ద ఫిర్యాదు చేశారు. పోలీసులు సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఆధారంగా సంతోష్ మారుతికి తెలియకుండానే అకౌంట్ ఓపెన్ అయ్యిందని శాట్ పేర్కొంది. సెబీ ఆర్డర్లను కొట్టేసింది. శాట్ తీర్పును సెబీ సుప్రీం కోర్టులో సవాల్ చేస్తుందో? లేదో? చూడాల్సి ఉందని సంతోష్ మారుతి లాయర్ పేర్కొన్నారు. ఐటీ డిపార్ట్మెంట్తో ఆయన డీల్ చేయాల్సి ఉందని అన్నారు.
ఫ్రాడ్ జరిగింది ఇలా
కేవైసీ ప్రాసెస్ కోసం బ్రోకరేజ్ కంపెనీ నియమించిన ఓ కన్సల్టెంట్ కంపెనీ సంతోష్ మారుతి ఫోటోలు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ డిటైల్స్తో 2006 లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసింది. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు ఫేక్ అడ్రస్తో అకౌంట్ క్రియేట్ చేసింది. 2009 లో ఆయన పేరు మీదే ట్రేడింగ్ అకౌంట్ను కూడా ఓపెన్ చేసింది. కానీ, అకౌంట్ ఓపెనింగ్లో ఆయన బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్లు ఇవ్వక పోవడంతో సంతోష్ మారుతికి ఈ విషయం వెంటనే తెలియలేదు. సెబీ ఆర్డర్స్ మేరకు తన శాలరీ అకౌంట్ను బ్యాంక్ ఫ్రీజ్ చేసిందని సంతోష్ మారుతి అన్నారు. స్టాక్ మానిప్యులేషన్పై దర్యాప్తు జరిగిందని చెప్పారు. రూ. 5 లక్షల ఫైన్ వేసిందని అన్నారు. సెబీ ఆర్డర్ తర్వాత 2016 లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సంతోష్ మారుతి నోటీసులు అందుకున్నారు. ట్యాక్స్ స్లాబ్స్ కంటే తక్కువ శాలరీని పొందుతున్న ఆయన ఐటీ నోటీసులు రావడంపై షాక్ అయ్యారు. కానీ, ఆయన రూ.13.35 లక్షల విలువైన ఓ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారని, అదే ట్రేడింగ్ అకౌంట్ నుంచి రూ.4.89 లక్షల విలువైన మరో కంపెనీ షేర్లను అమ్మారని ఐటీ నోటీసులో ఉంది. తానెప్పుడూ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయలేదని ఆయన అధికారుల వద్ద మొత్తుకున్నారు.