
ఇరాన్: ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల అనంతరం ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో.. ప్రత్యామ్నాయ మార్గాలపై భారత్ దృష్టి సారించింది.
రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని భారత్ నిర్ణయించింది. ఇరాన్లోని హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడి లాంటిది. హార్ముజ్ జలసంధి మీదుగా భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంటుండటం గమనార్హం.
BREAKING: Iranian parliament has just voted to close the Strait of Hormuz.
— Brian Krassenstein (@krassenstein) June 22, 2025
- 20% of global oil passes through the Strait
HERE’s what to expect if successful:
- Oil Prices could spike by 30–50%+ almost immediately
- Global Inflation likely Rises
- U.S. Gas Prices likely… pic.twitter.com/WC4dmeagRE
ఇరాన్లోని అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ పేరుతో అమెరికా చేసిన ఈ ఆపరేషన్లో ఇరాన్లోని మూడు అణు కేంద్రాలను అమెరికా ధ్వంసం చేసింది.
ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై ఆదివారం తెల్లవారుజామున దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన IRNA వార్తా సంస్థ ధృవీకరించింది. ఇరాన్లోని మూడు అణు స్థావరాలపై బాంబులు వేసినట్లు ఆదివారం (జూన్ 22) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు.
ఇస్ఫహాన్ సిటీలోని అణుస్థావరాలు టార్గెట్గా శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. తమ దాడుల్లో న్యూక్లియర్ రీసెర్చ్ ఫెసిలిటీని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో న్యూక్లియర్ రీసెర్చ్ ఫెసిలిటీ డ్యామేజీ అయిందని ఇరాన్ కూడా ధ్రువీకరించింది.