
బిజినెస్ డెస్క్, వెలుగు : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల ఒకటో తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ రూరల్ ఎకానమీకి పెద్దపీట వేయాలని సాగురంగ నిపుణులు సూచిస్తున్నారు. 2024 మే లో జరగనున్న తదుపరి సాధారణ ఎన్నికలకు ముందు ఇది చివరి పూర్తి స్థాయి బడ్జెట్ అయినందున, గ్రామీణ ప్రాంతాలపై ఈ బడ్జెట్ కచ్చితంగా దృష్టి సారిస్తుందని చెబుతున్నారు. అంతేగాక గడచిన రెండేళ్లుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైనఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అందుకే 2023–-24 బడ్జెట్కు రూరల్ ఎకానమీ కేంద్ర బిందువుగా మారవచ్చు. డీజిల్, కరెంటు, పశుగ్రాసం, దాణాధరలు పెరగడం వల్ల రైతన్నల ఆదాయం మరింత తగ్గింది. ఉక్రెయిన్– రష్యా సంక్షోభం తర్వాత వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. అగ్రి ఇన్ఫ్లేషన్2022 జూన్- నెలలో 20.3శాతం ఉంది. గడచిన 20 నెలలుగా ఇది రెండంకెల స్థాయిలోనే ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–-డిసెంబర్ మధ్య పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ధరలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయం, వ్యవసాయేతర వృత్తులు చేసుకునే వారి జీతాలు పెరగడం లేదు. 2022 ప్రారంభంలో విపరీతమైన వేడిగాలులు రావడంతో గోధుమ పంట దెబ్బతింది. వర్షాభావం, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. పల్లెటూళ్ల కార్మికులపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో గ్రామీణ ఉపాధి కల్పన పథకాన్ని పొడగించారు. కరోనా తగ్గింది కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సంక్షేమ పథకాల్లో కొన్నింటిని ఆపే అవకాశం ఉంది. కేంద్రం ఇది వరకే మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (ఉచిత ఆహారధాన్యాల పంపిణీ కార్యక్రమం)ను నిలిపివేసింది. అయితే ఈసారి రబీ, ఖరీఫ్ పంటలు బాగుంటాయని వార్తలు వస్తున్నాయి కానీ ధరల భారం వల్ల రైతుకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.
సాయం చేయాలె...
జీడీపీలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వాటా మరింత పెరగాలంటే కొన్ని నిర్ణయాలు అవసరం. 2023-–24 బడ్జెట్ గ్రామీణ వృద్ధి, ఆదాయాలు, ఉద్యోగాలు, జీవనోపాధిని పెంచేలా ఉండాలి. ఇందుకోసం ప్రస్తుత ఉత్పాదక గ్రామీణ పథకాలకు కేటాయింపులను పెంచడం, వ్యవసాయ కార్యకలాపాలలో టెక్నాలజీలను ప్రోత్సహించడం, వ్యవసాయ మౌలిక సదుపాయాలలో పెట్టుబడిని ప్రోత్సహించడం వంటివి కావాలి. పీఎం గరీబ్కల్యాణ్ యోజనను నిలిపివేయడం వల్ల 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. లక్ష కోట్ల వరకు ఆర్థిక ఆదా చేసుకోవచ్చు. ఈ డబ్బుతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం ఆవాస్ యోజన - గ్రామీణ్, పీఎం గ్రామీణ సడక్ యోజన వంటి పథకాలకు కేటాయింపులను పెంచాలి. 2022 బడ్జెట్ గడచిన సంవత్సరం 'కిసాన్ డ్రోన్ల' వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా నాబార్డ్ అగ్రికల్చర్ స్టార్టప్లకు ఆర్థిక సహాయం చేసింది. బ్లాక్చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డ్రోన్లు, ఐఓటీ వంటివి వ్యవసాయరంగ సమస్యలను పరిష్కరిస్తున్నాయి. వ్యవసాయ సరఫరా గొలుసు నెట్వర్క్లోని వాటాదారులను కనెక్ట్ చేయడానికి 'అగ్రిటెక్ ఫెసిలిటేషన్ సెల్'ని ఏర్పాటు చేయాలని సాగురంగ నిపుణులు సూచిస్తున్నారు. సాగు దిగుబడులు ఎక్కువగా ఉన్నప్పటికీ నిల్వ సదుపాయాలూ లేకపోతే నష్టాలు తప్పవు. మెరుగైన గిడ్డంగుల సౌకర్యాల ద్వారా పంట అనంతర నష్టాలను తగ్గించడంపై బడ్జెట్దృష్టి పెట్టాలి.ఇందుకోసం చిన్న ధాన్యాగారాలను ఎఫ్సీఐలు ఉన్న ప్రాంతంలో నిర్మించాలి. సాగురంగానికి ఇన్వెస్ట్మెంట్ల అవసరమూ ఎంతో ఉంది. వీటిని కూడా పెంచాలి. మౌలిక సదుపాయాలను మరింత విస్తరించాలి.
దేశాభివృద్ధికి అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇటీవలి కాలంలో తీవ్రంగా ప్రభావితమైంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. గడచిన రెండేళ్లుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి కేంద్రం ఈసారి బడ్జెట్లో కొన్ని నిర్ణయాలు ప్రకటించాలని సాగురంగ నిపుణులు సూచిస్తున్నారు.