ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో.. బోగస్ ఏరివేతకు ఏఐ టెక్నాలజీ

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో.. బోగస్ ఏరివేతకు ఏఐ టెక్నాలజీ

   సొంత ఇళ్లు ఎక్కడున్నా గుర్తించేలా సాఫ్ట్​వేర్

    జిల్లాలో 279 మంది అనర్హుల గుర్తింపు

నిజామాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ను మరింత పారదర్శకంగా అమలు చేస్తూ ​పేద కుటుంబాలు మాత్రమే లబ్ది పొందేలా ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ వాడుతోంది. మంజూరు చేసిన ప్రతీ ఇంటికి జియో ట్యాగింగ్​ చేసి నిర్మాణం దశలో ఉందో ఏఐ ద్వారా క్రాస్​చెక్​ చేస్తూ బిల్స్ రిలీజ్​ చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఇండ్ల  ఫొటోలు గరిష్టంగా 3 మీటర్ల దూరం నుంచి తీస్తేనే అప్​లోడ్​ అయ్యేలా రూపొందించిన సాఫ్ట్​వేర్​ అక్రమాలకు కళ్లెం వేస్తోంది. గతంలో మాదిరి ఒక ఇంటిని చూపి మరో ఇంటిపై బిల్​ డ్రా చేయడం ఇప్పుడు సాధ్యం కాదు. బోగస్​ వివరాలు సమర్పించి ఇండ్లు శాంక్షన్​ పొందిన వారిని గుర్తిస్తుంది.  

279 అనర్హుల గుర్తింపు

నిజామాబాద్​ జిల్లాలో 18,167 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా అందులో 13,636 గ్రౌండై వివిధ స్టేజ్​ల్లో పనులు నడుస్తున్నాయి. 630 ఇండ్ల నిర్మాణం ముగిసి గృహప్రవేశాలు జరిగాయి. ఏప్రిల్​లో 2,761, జూన్​లో 2,694  కలిపి మరో 5,455 ఇండ్లు కంప్లీట్​ చేసే దిశగా హౌసింగ్​ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. లబ్దిదారుల ఇబ్బందులు తొలగించి ఇంటి నిర్మాణాలు వీలైనన్ని ఎక్కువ పూర్తి చేయించేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సర్కార్ బోగస్​ వ్యక్తులు లబ్ధి పొందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఒక్కో ఇంటి నిర్మాణానికి అందిస్తున్న రూ.5 లక్షల సాయం పేద కుటుంబాలకే దక్కాలనే గట్టి సంకల్పంతో పనిచేస్తోంది. జిల్లాలో 279 మంది అనర్హులు లిస్ట్​లో ఉన్నట్లు వారం కింద తేలింది. సొంత ఇండ్లున్న 95 మంది శాంక్షన్​ పొందినట్లు నిర్దారించారు.  గతంలో ప్రభుత్వ స్కీమ్​ కింద ఇండ్లు మంజూరైన 120 మందిని,  సొంత కార్లున్న 64 మందిని ఏఐ గుర్తించింది. 

అనర్హత విలువ రూ.13.95 కోట్లు

 ప్రజాపాలన దరఖాస్తులు, విలేజ్​ సెక్రటరీ ఫీల్ట్​ వెరిఫికేషన్​ ప్రామాణికంగా బీపీఎల్​ కుటుంబాలకు ఎక్కువ సంఖ్యలో ఇండ్లు శాంక్షన్​ అయ్యాయి. కొందరు అనర్హులు తప్పుడు వివరాలతో ఎంపికయ్యారు. వారిని ఆధార్​ నంబర్ల​తో సహా ఏఐ పట్టుకుంది. ఆ రకంగా గుర్తించిన 279 ఇండ్ల స్కీమ్​ విలువ రూ.13.95 కోట్లు కాగా ఆ డబ్బును ఇతర ఎలిజిబుల్​ బీపీఎల్​ కుటుంబాల ఇండ్ల నిర్మాణానికి  ఖర్చు చేయనున్నారు. ఇక నుంచి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ లిస్ట్​ ప్రిపరేషన్​లో ఏఐ కీ రోల్​ పోషించనుంది. సర్కార్​ సాయంతో నిర్మించిన ఇండ్ల జియో ట్యాగింగ్​, బిల్స్​ రిలీజ్​లో ఏఐ ద్వారా లబ్ధిదారులకు మేలు కలుగుతోంది. గతంలో ఒకరి ఇంటి నిర్మాణ స్టేజ్​ను మరొకరు వాడి బిల్​ డ్రా చేసిన ఉదంతాలున్నాయి. ఇప్పడు అమలు చేస్తున్న 3 మీటర్లలోపు ఫొటో అప్​లోడింగ్​, ఏఐ క్రాస్​ చెకింగ్​ స్కీమ్​ను అవినీతికి దూరం చేశాయి. 

పేదల పథకంలో బోగస్​కు స్థానం లేదు

ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్​ చేసినం. ​ఏఐ మనుషులు చేయలేని అద్భుత పనులు చేసి  జిల్లాలో 279 మంది అనర్హులను దొరకబట్టింది. ఏఐ మాకు మేలు చేయడంతో పాటు లబ్దిదారులకు చాలా ఉపయోగపడుతున్నది. స్పీడ్​గా​ బిల్స్​ రిలీజ్​ కావడం అందులో భాగం.
- ​గంగాధర్, ఇన్​చార్జి​ డీఎం, హౌసింగ్​