న్యూఢిల్లీ : రాబోయే అయిదారేళ్లలో మన టెక్స్టైల్స్ ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల (రూ.8.2 లక్షల కోట్ల) కు పెంచాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారు. అప్పటికి మన టెక్స్టైల్స్ ఇండస్ట్రీ విలువ (దేశీయ, అంతర్జాతీయ) 250 బిలియన్ డాలర్లవుతుందని ఆయన చెప్పారు. 2021–22 లో దేశం నుంచి టెక్స్టైల్స్ ఎగుమతులు 42 బిలియన్ డాలర్ల (రూ.3.44 లక్షల కోట్ల) ని పేర్కొన్నారు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ మెంబర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్లో పీయూష్ గోయెల్ మాట్లాడారు. తమ అవసరాలకు సరిపడేలా కాటన్ కొనుగోలు చేయడానికి టెక్స్టైల్స్ తయారీదారులు రెడీ కావాలని ఆయన సూచించారు. కాటన్ సేకరణకు తగిన స్ట్రాటజీ రూపొందించేందుకు కాటన్ ఇండస్ట్రీ ప్రతినిధులందరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సిందిగా పిలుపు ఇచ్చారు. కాటన్ ప్రొడక్టులకు సరయిన విలువ వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన హితవు చెప్పారు.
కిందటేడాది మన టెక్స్టైల్స్ ఎగుమతులు 42 బిలియన్ డాలర్లని, రాబోయే అయిదారేళ్లలో వాటిని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు. 2022–23 క్రాప్ ఇయర్లో పత్తి ప్రొడక్షన్ 34.19 మిలియన్ బేళ్లుగా ఉంటుందని అగ్రికల్చర్ మినిస్ట్రీ డేటా అంచనా వేస్తోంది. అంతకు ముందు ఏడాది ఇది 31.20 మిలియన్ బేళ్లు (ఒక బేలుకు 170 కేజీలు).మన దేశంలో పత్తి పంట ప్రధానమైన ఖరీఫ్ పంటగా ఉంది. పత్తి హార్వెస్టింగ్ అక్టోబర్ నుంచి మొదలవుతుంది. టెక్స్టైల్ మిషన్ కింద అందుబాటులో ఉన్న ఫండ్స్ను కొత్త ప్రాజెక్టులకు వాడుకోవాలని పీయూష్ గోయెల్ చెప్పారు. జీ–20 లో మన టెక్స్టైల్స్ సెక్టార్ సామర్ధ్యాన్ని షోకేస్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. షాపింగ్ ఫెస్టివల్స్లో భాగం పంచుకోవాలనే ఫైనాన్స్ మినిస్టర్ ప్రపోజల్ను కూడా పరిశీలించాల్సిందిగా పరిశ్రమ ప్రతినిధులను మంత్రి కోరారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద ఉన్న 11 ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ మెంబర్లకూ కలిపి ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇండస్ట్రీ అసోసియేషన్ల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. టెక్స్టైల్స్ సెక్టార్ను పటిష్టం చేసేందుకు రెండు రోజుల మీటింగ్ నిర్వహించాల్సిందిగా పీయూష్ గోయెల్ తెలిపారు. ఇందులో కనీసం 50 % మంది యువత ఉండేలా చొరవ తీసుకోవాలని, డీపీఐఐటీ, ఫైనాన్స్– బ్యాంకింగ్ వంటివి ఉండాలన్నారు.