న్యూఢిల్లీ: హైస్పీడ్ డేటాకు, డిజిటల్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్ తీర్చడానికి టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉమ్మడిగా ఇన్వెస్ట్ చేస్తామని సోషల్ మీడియా కంపెనీ మెటా ఫ్లాట్ఫామ్స్, టెల్కో భారతీ ఎయిర్టెల్ ప్రకటించాయి. గ్లోబల్ కనెక్టివిటీ ఇన్ఫ్రా, ‘కమ్యూనికేషన్స్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్’ (సీపాస్) కోసం ఇవి డబ్బులు ఖర్చు చేస్తాయి. అంతేగాక సబ్సీ కేబుల్ సిస్టమ్, 2ఆఫ్రికా పరల్స్ ప్రాజెక్టుల కోసం ఎయిర్టెల్...మెటా, సౌదీ టెలికం కంపెనీతో కలసి పనిచేస్తుంది. 2ఆఫ్రికా పరల్స్ ను ఇండియాకు తీసుకొస్తామని 2021 సెప్టెంబరులో మెటా ప్రకటించింది.
ఒప్పందం ప్రకారం ఎయిర్టెల్, మెటాలు సీకేబుల్ సిస్టమ్ను ముంబైలోని ఎయిర్టెల్ ల్యాండింగ్ స్టేషన్ వరకు తీసుకొస్తాయి. మెటా తన వాట్సాప్ సర్వీసుతో సీపాస్ను ఇంటిగ్రేట్ చేస్తుంది. ఎయిర్టెల్, మెటాలు ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్(ర్యాన్) ప్రాజెక్టులో సభ్యులు. అనలిటిక్స్, ఏఐ, మెషీన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా రేడియో నెట్వర్క్స్ను ఆటోమేట్ చేయడం దీని ఉద్దేశం. ఎయిర్టెల్ ప్రస్తుతం హర్యానాలోని కొన్ని నగరాల్లో 4జీ,5జీ ఓపెన్ ర్యాన్టెక్నాలజీపై ట్రయల్స్ చేస్తోంది. తదనంతరం వీటిని ఇతర నగరాలకూ విస్తరిస్తుంది.