ఆసిఫాబాద్, వెలుగు: ఈ నెల 12న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణి, కాంట్రాక్టు, ఓబీ, కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు సక్సెస్ చేయాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగె ఉపేందర్ కోరారు. నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ ఓబీ కాంట్రాక్టర్ శ్రీనివాసనాయుడుకు సమ్మె నోటీస్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకే లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఆరోపించారు. సింగరేణిలో నూతన బొగ్గు బావులను ఓపెన్ చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. జిల్లా కౌన్సిల్ సభ్యుడు కొయ్యడ సాగర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
