
జమ్మూ కశ్మీర్ లో ఆర్మీ అరాచకాలు సృష్టిస్తోందన్న ఆరోపణలను ఖండించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఢిల్లీలో మాట్లాడిన ఆయన… భారత ఆర్మీ ఉగ్రవాదులపై మాత్రమే పోరాడుతుందని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు, కేంద్ర బలగాలు మాత్రమే శాంతి, భద్రతా వ్యవహారాలు చూస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో 199 పోలీస్టేషన్లు ఉంటే కేవలం 10స్టేషన్ల పరిదిలో మాత్రమే ఆంక్షలు ఉన్నట్లు చెప్పారు. ల్యాండ్ లైన్ ఫోన్లు వంద శాతం పని చేస్తున్నాయన్నారు. మెజారిటీ కశ్మీరీలు ఆర్టికల్ 370 రద్దును స్వాగతిస్తున్నారని అన్నారు. ఆర్థిక ప్రగతి, ఉద్యోగ అవకాశాలవైపు జమ్ము ప్రజలు వెళ్తున్నారని చెప్పారు.
శుక్రవారం సోపోర్ లో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన రెండున్నరేళ్ల పాప అస్మాజాన్ ను మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్ కు తరలించాలని దోవల్ ఆదేశించారు. భారత్ లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే 230మంది ఉగ్రవాదులు భారత లోకి చొరబడడానికి ప్రయత్నించగా… సైన్యం గుర్తించిందని అన్నారు. అందులో కొందరిని అరెస్ట్ చేశామని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదులనుంచి కశ్మీర్ ప్రజలను కాపాడేందుకు కట్టుబడిఉన్నామని అన్నారు.