- కష్టాలు తెలిసేది.. ఫ్యామిలీ ఉన్నోళ్లకే
- ప్రధాని మోడీపై అఖిలేశ్ ఫైర్
జలౌన్(యూపీ): ‘కుటుంబం గురించి, దాని విలువ గురించి ఫ్యామిలీ ఉన్నోళ్లకే అర్థమైతది. వాళ్లకు ఫ్యామిలీయే లేదు. ఇక కుటుంబ బాధలు ఎలా అర్థం అవుతాయి? ధరల పెరుగుదల వాళ్లకు ఎలా తెలుస్తుంది? నిరుద్యోగం గురించి ఎలా ఆలోచిస్తారు?’ అని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. రాజ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు యూపీలో రాచరికం చేయాలని చూస్తున్నారని, వారిది ‘ఆఖరి రాజవంశం’ అని ప్రధాని మోడీ చేసిన కామెంట్స్కు ఆయన కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం జలౌన్లో జరిగిన ఎన్నికల సభలో అఖిలేష్ మాట్లాడారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బులను కొందరు దోచుకుని దేశం విడిచి వెళ్లిపోయారని ఆరోపించారు. ఓ పారిశ్రామికవేత్త 28 బ్యాంకుల్లో రూ.22 వేల కోట్లకు పైగా తీసుకుని పారిపోయాడన్నారు. వాళ్లంతా ఎక్కడి వారో దేశం మొత్తానికి తెలుసన్నారు. మొదటి రెండు దశల పోలింగ్ తర్వాత తమ కూటమి సెంచరీ కొట్టిందని, నాలుగో దశ ముగిసే సరికి 200 సీట్లకుపైగా గెలుస్తుందని అఖిలేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీకి ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి బీజేపీ నేతలు సైలెంట్ అవుతున్నారని, విషయం వాళ్లకు అర్థమైందని అన్నారు.