రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఇండియా విపక్ష కూటమిలో భాగంగా యూపీలో కాంగ్రెస్ కు 16 నుంచి 18 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. సీట్ల పంపకాల ఒప్పందం కుదిరిన తర్వాత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటానని అఖిలేష్ స్పష్టం చేశారు.
ఇరు పార్టీల మధ్య పొత్తుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారని ఎస్పీ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్కు అమ్రోహా, బిజ్నోర్, సహరాన్పూర్, ఝాన్సీ స్థానాలు రావచ్చని, మథుర ఎస్పీకి వెళ్తుందని సమాచారం. ఎస్పీ పంపిన ప్రతిపాదనలో కొన్ని మార్పులు చేయాలని కాంగ్రెస్ కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఎస్పీ ఆఫర్ చేసిన పదిహేడు సీట్లలో రెండు లేదా మూడు స్థానాల్లో మార్పులు చేయాలని కాంగ్రెస్ కోరుతోందని సమాచారం. దీనిపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది . కాగా ఉత్తరప్రదేశ్ లో 80 పార్లమెంట్ స్థానాలున్నాయి .