కిష్టారెడ్డిపేట డివిజన్ కోసం రిలే నిరాహార దీక్ష

కిష్టారెడ్డిపేట డివిజన్ కోసం రిలే నిరాహార దీక్ష

అమీన్​పూర్​, వెలుగు: అమీన్​పూర్​ సర్కిల్​ పరిధిలోని కిష్టారెడ్డిపేటను 8 పంచాయతీలతో కలిపి కొత్త డివిజన్​ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కిష్టారెడ్డిపేటలో 8 గ్రామాల అఖిలపక్ష నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి రిలే దీక్షలో కూర్చున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, అమీన్​పూర్​ మున్సిపల్​ మాజీ చైర్మన్​ పాండురంగారెడ్డి, మాజీ వైస్​ చైర్మన్​ నందారం నర్సింహాగౌడ్​, కాంగ్రెస్​ అమీన్​పూర్​ పట్టణ అధ్యక్షుడు శశిధర్​ రెడ్డి, బీరంగూడ ఆలయ కమిటీ చైర్మన్​ సుధాకర్​యాదవ్​ దీక్షకు మద్దతు తెలిపారు. 

అనంతరం వారు మాట్లాడుతూ లక్షా ఇరవై వేల ఓట్లు ఉన్న అమీన్​పూర్​ మున్సిపాలిటీలో కేవలం 2 డివిజన్లు మాత్రమే చేశారని, 8 పాత గ్రామాలతో కలిపి కిష్టారెడ్డిపేటను కొత్త డివిజన్​ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్​ చేశారు. జీహెచ్​ఎంసీ పరిధిలో కొన్ని చోట్ల 20 వేల ఓట్లకు డివిజన్​ ఏర్పాటు చేశారన్నారు. 40 వేల ఓటర్లు, 80 వేల జనాభా  ఉన్న ఈ 8 గ్రామాలను కలిపి కొత్త డివిజన్​ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం డివిజన్​ ఏర్పాటు చేసే వరకు తమ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలిపారు.