
- జాతీయ పార్టీలతోనూ చర్చలు జరుపుతం త్వరలో అందరం భేటీ అవుతం: కేసీఆర్
- ఉద్ధవ్ థాక్రే, శరద్పవార్తో కలిసి పనిచేస్తామని వెల్లడి
- దేశ భవిష్యత్ కోసం చొరవ తీసుకుంటున్నం: ఉద్ధవ్
- ఇంకా చాలా అంశాలపై చర్చించాల్సి ఉంది: శరద్ పవార్
- ముంబైలో ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్తో విడివిడిగా కేసీఆర్ భేటీ
- జాతీయ రాజకీయాలపై చర్చ..
- స్పెషల్ అట్రాక్షన్గా ప్రకాశ్రాజ్
హైదరాబాద్, వెలుగు: దేశ రాజకీయాలకు కొత్త బాటలు వేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని, జాతీయ పార్టీలతోనూ చర్చలు జరుపుతామని చెప్పారు. ఒకే తరహా ఆలోచనలు ఉన్న నాయకులం త్వరలోనే హైదరాబాద్లోనో, మరో చోటనో కలుస్తామని అన్నారు. ఆదివారం ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో విడివిడిగా సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
జాతీయ రాజకీయాలపై చర్చించారు. అనంతరం ఉద్ధవ్ నివాసం ‘వర్ష’లో ఆయనతో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా అనేక సమస్యలు అట్లనే ఉన్నాయని, దేశంలో ఏ మార్పులైతే రావాలో అవి చోటు చేసుకోలేదన్నారు. దేశంలో రావాల్సిన మార్పులు, పాలసీల మార్పు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్ధవ్, తాను చర్చించామని చెప్పారు. ఈ చర్చల తర్వాత తాము కలిసి నడవాలని నిర్ణయించామని, అందుకు ఇది తొలి అడుగు మాత్రమేనని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి మొదలైన ఏ ఉద్యమమైన విజయవంతమవుతుందన్నారు. మరాఠా యోధులు ఛత్రపతి శివాజీ, బాల్ థాక్రే స్ఫూర్తితో తాము ముందుకు సాగుతామని చెప్పారు. ఉద్ధవ్ థాక్రే మంచి ఆతిథ్యం ఇచ్చారని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రతో తమది సోదర సంబంధమని, ఆ రాష్ట్రంతో వెయ్యి కిలో మీటర్ల సరిహద్దు ఉందని, అనేక అంశాల్లో కలిసి నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తర్వాత నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రూపురేఖలు మారిపోయాయని కేసీఆర్అన్నారు.
ఉద్ధవ్తో కేసీఆర్ చర్చలు
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయల్దేరారు. ఆయన వెంట ఎంపీలు బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల శ్రావణ్కుమార్ రెడ్డి ఉన్నారు. ముంబై ఎయిర్ పోర్టులో సీఎం కేసీఆర్కు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్వాగతం పలికారు. తన వెంట వచ్చిన వారిని ప్రకాశ్రాజ్కు కేసీఆర్ పరిచయం చేశారు. అక్కడి నుంచి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసం ‘వర్ష’కు చేరుకున్నారు. శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్, ఇతర నాయకులతో కలిసి లంచ్ చేశారు. అనంతరం ఉద్ధవ్తో కేసీఆర్ కాసేపు విడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులు గంటకుపైగా సమావేశమై జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇతర అంశాలపై
చర్చించారు.
త్వరలో స్టాలిన్తో భేటీ
సీఎం కేసీఆర్ త్వరలోనే తమిళనాడు సీఎం స్టాలిన్తో భేటీ అవుతారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఆ తర్వాత పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తోనూ కేసీఆర్ మాట్లాడుతారని చెప్తున్నాయి. మార్చిలో ఎన్డీఏయేతర సీఎంల సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీల అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకుల సమావేశం ఉంటుందని వివరించాయి. ఈ రెండు సమావేశాలు హైదరాబాద్ లేదా ఢిల్లీలో నిర్వహించే అవకాశముందని చెబుతున్నాయి. ఇదే విషయం ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్కు కేసీఆర్ ఆదివారం వివరించారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇదే విషయంపై మిగతా రాజకీయ పార్టీలతోనూ కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే మీటింగ్ ఉంటుందని పేర్కొంటున్నాయి.
శరద్ పవార్తో సమావేశం
మహారాష్ట్ర సీఎంతో భేటీ అనంతరం సీఎం కేసీఆర్ ముంబైలోని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసం ‘సిల్వర్ ఓక్స్’కు చేరుకున్నారు. గంటన్నరకు పైగా పవార్తో కేసీఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ భేటీలో ఎన్సీపీ ముఖ్య నేత ప్రపుల్ పటేల్, పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేసీఆర్, పవార్ మీడియాతో మాట్లాడారు. శరద్ పవార్ 1969 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతునిస్తూనే ఉన్నారని, దేశంలోనే ఆయన అత్యంత సీనియర్ నేత అని కేసీఆర్ అన్నారు.
దేశం సరైన దిశలో ముందుకెళ్లడం లేదని, దళితుల అభివృద్ధి జరగడం లేదని, అందుకే దేశానికి సరైన ఎజెండా ఉండాలని కోరుతున్నానని చెప్పారు. శరద్ పవార్తో కలిసి పనిచేస్తామన్నారు. త్వరలోనే మరికొందరు నేతలను కలిసి ప్రజల ముందు తమ ఎజెండా ఉంచుతామని కేసీఆర్ వెల్లడించారు. దేశ రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పోరాడిందని, కేసీఆర్తో కలిసి పనిచేస్తామని శరద్ పవార్ అన్నారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణలో ముందు ఉందని చెప్పారు. దేశంలోని పేదరికం, రైతుల సమస్యలు, దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై తాము చర్చించామన్నారు. రాజకీయ అంశాలు తమ మధ్య పెద్దగా చర్చకు రాలేదని, దేశ అభివృద్ధి గురించే ఎక్కువగా మాట్లాడమని ఆయన పేర్కొన్నారు. మున్ముందు కూడా కేసీఆర్ను కలుస్తానని, ఇంకా చాలా అంశాలపై చర్చించాల్సి ఉందన్నారు. శరద్పవార్తో భేటీ అనంతరం కేసీఆర్ బృందం ముంబై నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైంది.
హైదరాబాద్కు రమ్మని ఉద్ధవ్ను పిలిచిన
ఉద్ధవ్ థాక్రేను హైదరాబాద్కు రావాలని ఆహ్వానించానని కేసీఆర్ చెప్పారు. భావసారూప్యత ఉన్న అనేక రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నానన్నారు. రానున్న రోజుల్లో అన్ని పార్టీలతో కలిపి ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. కలిసి వచ్చే జాతీయ పార్టీలతోనూ చర్చలు జరుపుతామన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు సరిగా లేవని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నకు కేసీఆర్ స్పందిస్తూ.. ఆల్టర్నేటివ్ రాజకీయాలపై ఇప్పుడు ముందడుగు మాత్రమే పడిందని, రానున్న రోజుల్లో అన్ని పార్టీలతో చర్చించి.. అందరి అభిప్రాయం మేరకు ముందుకుపోతామని తెలిపారు.
స్పెషల్ అట్రాక్షన్గా ప్రకాశ్రాజ్
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర టూర్లో సినీ నటుడు ప్రకాశ్రాజ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ముంబై ఎయిర్పోర్టులో కేసీఆర్ బృందానికి ఆయన స్వాగతం పలికారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో జరిగిన భేటీలోనూ ఆయన పాల్గొన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రకాశ్రాజ్ పెద్దగా కనిపించలేదు. కేసీఆర్ ముంబై పర్యటన సందర్భంగా ప్రత్యక్షమవడం రాజకీయ, సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ విధానాలను వ్యతిరేకించే ప్రకాశ్రాజ్ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించినప్పుడు.. కేసీఆర్తో ప్రకాశ్రాజ్ కలిసి పనిచేశారు. అప్పట్లో కేసీఆర్ మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయినప్పుడు కూడా ప్రకాశ్రాజ్ వెంటే ఉన్నారు. కేంద్రంలో బీజేపీకి ఆల్టర్నేట్ రాజకీయ కూటమి ఏర్పాటులో ప్రకాశ్రాజ్ కీలకంగా పనిచేస్తారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
తెలంగాణతో కలిసి పనిచేస్తం: ఉద్ధవ్
సూడో నేషనలిజం మంచిది కాదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. తమ హిందుత్వం ప్రతీకారం తీర్చుకునేది ఎంతమాత్రం కాదని చెప్పారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఎవరైనా కావొచ్చని, కానీ దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని, దేశ భవిష్యత్ కోసం తాము చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. తమ చర్చల్లో రహస్యమేదీ లేదని, ఏది చేసినా బహిరంగంగానే చేస్తామన్నారు. ఈ చర్చలు ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో మరికొంత మందిని కలుస్తామని ఉద్ధవ్ అన్నారు. తమ సోదర రాష్ట్రం తెలంగాణతో అన్ని అంశాల్లో కలిసి పనిచేస్తామన్నారు. కేసీఆర్, తాను చాలాకాలంగా కలవాలని అనుకుంటున్నామని, అది ఇప్పుడు సాధ్యమైందని ఆయన చెప్పారు. అన్ని అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు.