న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్ వెళ్లిన మోడీ మంగళవారం (నవంబర్ 11) థింపూలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పేలుడుకు బాధ్యులైన అందరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు. ఢిల్లీ పేలుడు ఒక భయంకరమైన ఘటన అని.. బాధిత కుటుంబాల దుఃఖాన్ని తాను అర్థం చేసుకోగలనని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోందని ధైర్యం చెప్పారు. కుట్ర కోణంపై ఏజెన్సీలు ముమ్మురంగా దర్యాప్తు చేస్తున్నాయని.. ఈ కుట్రను ఏజెన్సీలు ఛేధిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
భారీ పేలుడుతో సోమవారం (నవంబర్ 11) దేశరాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన బ్లాస్ట్లో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఘటనా స్థలాన్ని మొత్తం నల్లటి పొగ కమ్మేసింది. అరుపులు.. ఏడుపులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఓ వ్యక్తి డెడ్బాడీ కారు సైడ్ మిర్రర్పై వేలాడుతూ కనిపించింది. ఆటో రిక్షాపై ఓ వ్యక్తి చేయి తెగిపడింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోమవారం (నవంబర్ 11) సాయంత్రం 6.52 గంటలకు హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బ్లాస్ట్ సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నారని, వెహికల్ స్లోగా మూవ్ అవుతున్నదని చెప్తున్నారు. పేలుడు ధాటికి 22 కార్లు, 2 ఈ -రిక్షాలు, ఒక ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి.
కొన్ని మీటర్ల దూరం వరకు పార్క్ చేసిన వాహనాల అద్దాలూ ధ్వంసం అయ్యాయి. ఇండ్లు, దుకాణాల తలుపులు, కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదం అనంతరం 20 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయి. పేలుడు ఘటనలో 24 మందిగాయపడ్డారు.
వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. గాయపడిన వారిని దగ్గర్లోని ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నాయి ఏజెన్సీలు.
