ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టుకు ఒక వింత కేసు వచ్చింది. పదహారేళ్ల బాలుడిని తన సంరక్షణలో ఉండేలా అనుమతించాలంటూ ఆజంగఢ్కు చెందిన బాలుడి తల్లి కేసు నమోదు చేసింది. అయితే ఆ బాలుడికి అప్పటికే పెళ్లై, సంతానం కూడా ఉండటంతో.. తన సంరక్షణలో ఉండేలా అనుమతించాలంటూ అతని భార్య కూడా కోర్టును ఆశ్రయించింది. బాలుడు మాత్రం తాను భార్య దగ్గరే ఉంటానంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు.
ఆరు నెలల పాటు ఈ కేసు విచారణ సాగింది. ఈ కేసు విచారణ జరిపిన జస్టిస్ జెజె.మునీర్ బాలుడిని మైనారిటీ తీరే వరకు..వచ్చే 2022 ఫిబ్రవరి 4వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని షెల్టర్ హోంకు తరలించాలని తీర్పునిచ్చారు. మైనార్టీ తీరాక అతడు తన ఇష్ట ప్రకారం ఎవరితోనైనా ఉండవచ్చని కూడా స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబర్ 18న ఈ కేసు కోర్టుకు వచ్చింది. మే 31న జస్టిస్ మునీర్ తుది తీర్పు తెలపగా.. రెండు వారాల తర్వాత కోర్టు వెబ్సైటులో పోస్ట్ చేశారు.