
- మెడికల్ కాలేజీ పనులు చేపట్టకపోతే ధర్నా చేస్తా
- మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, వెలుగు: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కమీషన్ల కోసం నిర్మల్ నియోజక వర్గంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నిర్మల్ లోని తన క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పా ల్పడుతున్నారని తెలిపారు. తన వద్ద ఆధారాలున్నాయని దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాను కష్టపడి సాధించిన మెడికల్ కళాశాల మహేశ్వర్ రెడ్డి కారణంగా రద్దయ్యే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో రూ.121 కోట్లు మంజూరయ్యాయని, ఇప్పటికైనా కళాశాలలో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్చేశారు. లేకపోతే ఆర్డీవో ఆఫీస్ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు రూ.18 కోట్లు మంజూరు చేయించి, ఐదెకరాల స్థలం కేటాయిస్తే ఎమ్మెల్యే ఆ పనులను సైతం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎన్ వోసీ ఇవ్వకుండా ఇరిగేషన్ డీఈ ద్వారా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
నిర్మల్ లో హరిత హోటల్ పనులనూ కమీషన్ల కోసం జరగనివ్వడం లేదన్నారు. కోర్టుల భవనాలకు సోఫీనగర్ లోని డీసీఎంఎస్ గోదాంల స్థలాన్ని కేటాయిస్తే బఫర్ జోన్ పేరుతో నిలిపివేయించి, చించోలి బి మహిళా ప్రాంగణంలో నిర్మించాలనకుంటున్నారని చెప్పారు. ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, బన్సపల్లి పీఏసీఎస్ చైర్మన్ రమణారెడ్డి, మాజీ జడ్పీటీసీలు రాజేశ్వర్, చిన్న రామయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముడుసు సత్యనారాయణ, రఘునందన్ రెడ్డి తదితరులున్నారు.