నిర్మల్​ రింగ్ రోడ్ ప్రపోజల్స్​కే పరిమితం..రెండేండ్ల కింద అంచనాలు రూపొందించిన అధికారులు

నిర్మల్​ రింగ్ రోడ్ ప్రపోజల్స్​కే పరిమితం..రెండేండ్ల కింద అంచనాలు రూపొందించిన అధికారులు
  •     4 గ్రామాలను కలుపుతూ 30 కి.మీ. మేర నిర్మించాలని ప్లాన్
  •     రూ.35కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదిక
  •     ఫండ్స్​రిలీజ్ చేయని బీఆర్ఎస్​ప్రభుత్వం
  •     కొత్త ప్రభుత్వంపైనే నిర్మల్ ​వాసుల ఆశలు

నిర్మల్, వెలుగు: నిర్మల్​జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్​రింగ్​రోడ్ నిర్మించాలని రెండేండ్ల కింద ప్లాన్​రెడీ చేసినప్పటికీ.. ఇంతవరకు ముందర పడలేదు. గత ప్రభుత్వం ఫండ్స్​రిలీజ్​చేయకపోవడంతో రింగ్ రోడ్ ప్రతిపాదనలకే పరిమితమైంది. రోజురోజుకు టౌన్ విస్తరిస్తుండడంతో, ఇంటర్నల్​రోడ్లపై ట్రాఫిక్​పెరిగిపోతోంది. తూర్పున ఉన్న గ్రామాల ప్రజలు పడమర వైపు ఉన్న గ్రామాలకు వెళ్లాలంటే, టౌన్​లోకి రాక తప్పడం లేదు.

దూరభారం పెరగడంతోపాటు, ట్రాఫిక్​లో చిక్కుకోవాల్సి వస్తోంది. దీంతోనే రెండేండ్ల కింద నిర్మల్​చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదనను ఆర్​అండ్​బీ అధికారులు తెరపైకి తెచ్చారు. దాదాపు 30 కిలోమీటర్ల మేర, నాలుగు లేన్ల రోడ్లు నిర్మించాలని ప్లాన్​చేశారు. ఇందుకుగానూ రూ.35 కోట్లు ఖర్చు అవుతుందని వివరిస్తూ.. అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అప్పటి అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సైతం రింగ్​రోడ్​ప్రతిపాదనలపై ఫోకస్​పెట్టానని, సీఎం దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. కానీ ఫండ్స్​రిలీజ్ చేయలేదు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ​ప్రభుత్వమైనా నిర్మల్​ టౌన్​ను పట్టించుకోవాలని, ఫండ్స్​ రిలీజ్ ​చేసి, రింగ్​రోడ్డును పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. 

రాణాపూర్ ​మొదలు.. 

అధికారుల ప్లాన్​ప్రకారం నిర్మల్ చుట్టూ ఉన్న గ్రామాలను కలుపుతూ రింగ్​రోడ్​నిర్మించాల్సి ఉంది. రాణాపూర్ నుంచి మొదలుకొని ఎల్లారెడ్డిపేట, పులిమడుగు, నీలాయి పేట, కిషన్ రావుపేట, న్యూ పోచంపాడు మీదుగా అక్కాపూర్, కడ్తాల్, కౌట్లకే, చిట్యాల వరకు, అక్కడి నుంచి లంగ్డాపూర్, తల్వేద, ఆలూర్, లక్ష్మీపూర్ మీదుగా రాణాపూర్ వరకు నిర్మించాలని ప్రతిపాదించారు. అలాగే రింగ్​రోడ్​ను పులిమడుగు నుంచి కడ్తాల్ వరకు నేషనల్ హైవే 44కు లింక్ చేయాలని ప్లాన్ ​చేశారు. నిర్మల్ మీదుగా వెళ్లే 3 హైవేలను రింగ్ రోడ్​తో లింక్ చేస్తామని చెప్పారు.

గ్రామాలకు ఎంతో మేలు

నిర్మల్ లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. రెండు నేషనల్​హైవేలకు ఆనుకొని ఉన్న టౌన్​లోకి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. రింగ్​రోడ్​నిర్మిస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు దూరభారం తగ్గుతుంది. టౌన్​లోకి వెళ్లాల్సిన పని ఉండదు. రేవంత్​సర్కార్​ఈ అంశంపై ఫోకస్​ పెట్టి, నిధులు విడుదల చేయాలని నిర్మల్​తోపాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.