డైవింగ్‌కు వెళ్తే 1500 ఏళ్ల నాటి గోల్డ్​ కాయిన్స్​ దొరికినయ్

డైవింగ్‌కు వెళ్తే 1500 ఏళ్ల నాటి గోల్డ్​ కాయిన్స్​ దొరికినయ్

స్పెయిన్‌‌ సముద్ర తీరంలో డైవింగ్‌‌కు వెళ్లిన ఇద్దరికి పురాతన కాలం నాటి అరుదైన బంగారు నాణాలు దొరికాయి. ఈ నాణాలు రోమన్​ చక్రవర్తుల కాలం నాటివని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. బావామరుదులైన లూయిస్​ లెన్స్, సీజర్​ గిమేనో స్పెయిన్​లోని జిబియా పట్టణానికి సమీపంలో ఉన్న సముద్ర తీరంలో డైవింగ్​కు వెళ్లారు. సముద్రపు అడుగున ఉన్న నాచు, పిచ్చిమొక్కలను క్లీన్‌‌ చేసే ప్రయత్నం చేశారు. ఏడు మీటర్ల లోతులో క్లీన్​ చేస్తుండగా మెరుస్తున్న కొన్ని వస్తువులు వారి కంటపడ్డాయి. తొలుత వాటిని పది సెంట్ల కాయిన్స్​ అనుకున్నారు. వాటిని బోటు దగ్గరకు తీసుకొచ్చి పరిశీలిస్తే రోమన్​ చక్రవర్తుల బొమ్మలు కనిపించాయి. మిగతా నాణాలను వెలికి తీయడానికి రెండు గంటల సమయంపైగా పట్టింది. మొత్తం 53 బంగారు నాణాలను వారు గుర్తించారు. వాటిని యూరప్‌‌ అలికాంటె యూనివర్సిటీలోని ఆర్కియాలజీ డిపార్ట్‌‌మెంట్‌‌ వారికి అప్పగించారు. పరిశోధనలు చేసిన ఎక్స్​పర్ట్స్​ ఆ నాణాలు 4, 5 శతాబ్దాలకు సంబంధించినవని గుర్తించారు. పదిహేను వందల ఏండ్ల క్రితం నాటివయినా నాణాలు కొంచెం కూడా చెక్కు చెదరలేదు. వాటిపై ఉన్న ఆనవాళ్లు, రాజుల బొమ్మలు స్పష్టంగా తెలుస్తున్నాయని ఆర్కియాలజిస్టులు తెలిపారు. ఈ నాణాలపై ఉన్న బొమ్మలు రోమన్‌‌ చక్రవర్తులు వాలెంటీనియన్​ I, వాలెంటీనియన్​ II, థియోడోసియస్ I, ఆర్కాడియో, హానోరియస్ విగా గుర్తించారు. క్రీస్తుశకం 409లో ఐబేరియన్‌‌ ద్వీపకల్పాన్ని రోమన్లు నాశనం చేశారు. అప్పుడు ఈ నాణాలు సముద్రంలో పడి ఉండొచ్చని ఆర్కియాలజిస్టులు అంటున్నారు. ప్రస్తుతం వీటిని శుభ్రం చేసి మ్యూజియంలో పెట్టడానికి రెడీ అవుతున్నారు.