ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ అనుమతించాలని వినతి
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటెయిల్ కేసులో ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ మొదలెట్టేలా చూడాలని అమెజాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) లో అంతకు ముందు ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రొసీడింగ్స్ను ఆపేందుకు ఫ్యూచర్ గ్రూప్ చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా కోర్టు ముందుంచారు అమెజాన్ తరఫున వాదించిన సీనియర్ లాయర్ గోపాల్ సుబ్రమణియన్. ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిందని పేర్కొన్నారు. ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయరాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ కూపన్స్లో అమెజాన్ పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఫ్యూచర్ గ్రూప్ను రిలయన్స్కు అమ్మాలని కిషోర్ బియాని నిర్ణయించారు. కానీ, కొనుక్కునే హక్కు మొదటగా తమకే ఉంటుందంటూ అమెజాన్ కోర్టుకెక్కింది. అప్పటి నుంచీ ఒకరిపై ఒకరు వేరు వేరు కోర్టులలో కేసులు దాఖలు చేసుకుంటున్నారు. ఈ న్యాయపరమైన పోరాటం గత ఏడాది కాలంగా సాగుతోంది. ప్రొసీడింగ్స్ కొనసాగించాలనే ఉద్దేశంతో నవంబర్ 28 న ఫైనల్ హియరింగ్ జరపాలని ట్రిబ్యునల్ నిర్దేశించింది. ప్రొసీడింగ్స్ నిలిపి వేసే ఉద్దేశంతోనే ఫ్యూచర్ గ్రూప్ 200 పైగా పిటిషన్లు దాఖలు చేసిన అంశాన్ని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. కేసును ఆలస్యం చేసే ఉద్దేశమే ఇందులో కనబడుతోందని ఫ్యూచర్ గ్రూప్ న్యాయవాదికి చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. ఇది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్. దేశంలోని కోర్టులు దేశ ప్రతిష్టను కాపాడేలా ఉండాలని చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రల్ ప్రొసీడింగ్స్ను గౌరవించేలా గ్లోబల్ ఇండియా ఉండాలని హితవు చెప్పారు. ఆర్బిట్రేషన్ ప్రొసీజర్ను అడ్డుకోవడాన్ని సమర్ధించలేమని ఆయన పేర్కొన్నారు