ఉద్యోగ కోతలపై వివరణ కోరుతూ కేంద్ర కార్మిక శాఖ నుంచి మంగళవారం అందిన నోటీసులపై ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ స్పందించింది. అమెజాన్ పబ్లిక్ పాలసీ మేనేజర్ స్మితా శర్మ ఇవాళ బెంగళూరులోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఎ.అంజప్ప ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. అమెజాన్ లో భారీగా ఉద్యోగ కోతలు జరుగుతున్నాయంటూ న్యాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్) అనే సంఘం నుంచి కేంద్ర కార్మిక శాఖకు అందిన ఫిర్యాదులో వాస్తవికత లేదని స్మితా శర్మ స్పష్టం చేశారు. అమెజాన్లో ఏ ఒక్కరినీ ఉద్యోగం నుంచి తీసేయలేదని తేల్చి చెప్పారు.
కొంతమంది అర్హులైన ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ (వాలంటరీ సెపరేషన్ ప్రోగ్రామ్) పథకాన్ని మాత్రమే ప్రస్తుతం అమెజాన్ అమలు చేస్తోందని అమెజాన్ పబ్లిక్ పాలసీ మేనేజర్ స్మితా శర్మ అన్నారు. నవంబరు 16న అమల్లోకి వచ్చిన ఈ పథకం నవంబరు 30 వరకు అమల్లో ఉంటుందని ఆమె తెలిపారు. ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఆలోగా దరఖాస్తులు సమర్పించవచ్చని కోరారు. ఈ పథకం ద్వారా ముందస్తుగా పదవీ విరమణ చేస్తున్న వారికి తగిన ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు ఒకవేళ వద్దు అని భావిస్తే.. నిర్ణీత గడువులోగా స్వచ్ఛంద పదవీ విరమణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవచ్చని వివరించారు.