ప్రముఖ ఆన్లైన్ సంస్థ అమెజాన్ తాజాగా ఆన్లైన్ ఫార్మసీని ప్రారంభించింది. మార్కెట్లో తన పరిధిని పెంచుకోవడం కోసం ఈ-కామర్స్ దిగ్గజం ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొదటగా దేశంలో బెంగుళూరు నుంచి ఫార్మసీ సేవలు ప్రారంభించనుంది. ఈ ‘అమెజాన్ ఫార్మసీ’ ఓవర్ ది కౌంటర్ లేదా ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు, ఆరోగ్య పరికరాలు, మూలికా ఔషధాలను సరఫరా చేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఫ్లిప్కార్ట్, జియోమార్ట్ మొదలైన కంపెనీల నుంచి పోటీని ఎదుర్కొనేందుకు అమెజాన్ ఈ ఫార్మసీని మొదలుపెట్టింది. అమెజాన్ గత నెలలో ఇండియాలో 10 కొత్త స్టోర్లను ప్రారంభించింది. వాటి ద్వారా ఆటో ఇన్సూరెన్స్ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. అంతేకాకుండా భారత్ లోని ఒక రాష్ట్రంలో ఆల్కహాల్ డెలివరీ కోసం కూడా క్లియరెన్స్ పొందింది.
ఆన్లైన్ లో ఔషధ అమ్మకాలకు సంబంధించి అమెజాన్ ఇంకా ఎటువంటి నిబంధనలను ఖరారు చేయలేదు. మెడ్లైఫ్, నెట్మెడ్స్, టెమాసెక్-బ్యాక్డ్ ఫార్మ్ఈజీ మరియు సీక్వోయా క్యాపిటల్-బ్యాక్డ్ 1 ఎంజి వంటి అనేక ఆన్లైన్ సంస్థలు.. సాధారణ మెడికల్ షాపుల వ్యాపారాన్ని దెబ్బతీశాయి. దాంతో ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల అసోసియేషన్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆన్లైన్ ఫార్మసీల వల్ల సరైన ధృవీకరణ లేకుండా మందుల విక్రయానికి దారితీస్తుందని అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. అయితే తాము భారత చట్టాలకు కట్టుబడి ఉన్నామని.. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వమని కంపెనీలు తెలిపాయి.
‘అమెజాన్ యొక్క కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మేం మా వ్యాపారాన్ని కోల్పోతాం. ఆఫ్లైన్ మందుల వ్యాపారంపై 5 మిలియన్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి’ అని న్యూఢిల్లీలోని సౌత్ కెమిస్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ లీగల్ హెడ్ యష్ అగర్వాల్ అన్నారు.
For More News..