- తీవ్ర కాలుష్యం నేపథ్యంలో నిర్ణయం
న్యూఢిల్లీ: గాలిలో నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పోర్ట్స్ నిర్వహణ సంస్థలు తమ ఫిజికల్ స్పోర్ట్స్ ఈవెంట్లను వాయిదా వేసుకోవాలని సూచించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏ క్రీడా ఈవెంట్లకూ అనుమతులు ఇవ్వబోమని వెల్లడించింది.
ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. జాతీయ క్రీడా సమాఖ్యలు, కేంద్ర క్రీడాశాఖ గుర్తించిన అన్ని యూనివర్సిటీలు ఈ ఆదేశాలు పాటించాలని పేర్కొంది.
ఢిల్లీలో గురువారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 391 ఉండగా, శుక్రవారం 370గా నమోదైంది. ఢిల్లీలోని 23 మానిటరింగ్ స్టేషన్లు ‘వెరీ పూర్’ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. మరో 13 స్టేషన్లు ‘సివియర్’ స్థాయి కాలుష్యాన్ని నమోదు చేశాయి. రోజుకు 10 నుంచి 11 సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి ఎంత నష్టమో.. ప్రస్తుత పరిస్థితిలో ఢిల్లీలో గాలి పీల్చడం వల్ల కూడా ఆరోగ్యానికి అంతే నష్టమని డాక్టర్లు చెబుతున్నారు.
