ఇరాన్ పై అమెరికా ఎటాక్..బంకర్ బస్టర్ బాంబులు, మిసైళ్లతో మూడు అణు కేంద్రాల పేల్చివేత

ఇరాన్ పై అమెరికా ఎటాక్..బంకర్ బస్టర్ బాంబులు, మిసైళ్లతో మూడు అణు కేంద్రాల పేల్చివేత
  • తగ్గకపోతే మరిన్ని దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరిక
  • అమెరికా ప్రారంభిస్తే.. తాము ముగిస్తామన్న ఇరాన్ 
  • తమ అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని ప్రకటన 
  • అమెరికా పెద్ద తప్పు చేసింది.. మూల్యం చెల్లించుకోవాల్సిందే
  • ఇకపై ప్రతి అమెరికన్​నూ టార్గెట్ చేస్తామని హెచ్చరిక
  • ఇజ్రాయెల్​పై 40 మిసైళ్లతో ప్రతీకార దాడి.. అమెరికా, ఇజ్రాయెల్​లో హైఅలర్ట్ 

వాషింగ్టన్:   ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా కూడా ఎంటరైంది. అర్ధరాత్రి అదను చూసి ఇరాన్ లోని మూడు కీలక అణు కేంద్రాలను బాంబులు, మిసైళ్లతో పేల్చేసింది. ‘ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్’ పేరుతో చేపట్టిన ఈ మిషన్ లో ఏడు బీ2 స్టెల్త్ బాంబర్ విమానాలు మూడో కంటికి తెలియకుండా ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి.. ఫోర్డో, మరో రెండు అణు కేంద్రాలపై బాంబులు వేసి వెళ్లిపోయాయి. 

అదే సమయంలో అటు పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం నుంచి రెండు జలాంతర్గాముల ద్వారా ఏకంగా 30 తొమహాక్ మిసైల్స్ దూసుకొచ్చి నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను పేల్చేశాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (అమెరికన్ టైం ప్రకారం.. శనివారం రాత్రి) ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు. ఇరాన్ లోని ఫోర్డో న్యూక్లియర్ సైట్ తోపాటు నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించారు. 

ఫోర్డో సైట్ పై బీ2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాలతో 6 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించామని తెలిపారు. అరేబియా సముద్రంలో మోహరించిన జలాంతర్గాముల నుంచి 30 తొమహాక్ క్షిపణులను ప్రయోగించి.. నతాంజ్, ఇస్ఫహాన్ కేంద్రాలను పేల్చేశామన్నారు. ఇక ఆ దేశం అణ్వస్త్ర తయారీ కార్యక్రమం ముగిసినట్టేనని ప్రకటించారు. 

అమెరికా బలగాలపై ఇరాన్ దాడి చేస్తే గనక.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ‘‘ఇకపై శాంతి నెలకొనాలి. లేదంటే ఇరాన్ కు విషాదం తప్పదు” అని వార్నింగ్ ఇచ్చారు. దాడుల తర్వాత ఆదివారం ఉదయం ముందుగా తన ట్రూత్ సోషల్ మీడియా వేదికలోనూ ట్రంప్ వరుస పోస్టులు పెట్టారు. 

ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేశామని, తమ విమానాలన్నీ సేఫ్ గా తిరిగి వస్తున్నాయని ప్రకటించారు. ‘‘ఇరాన్ తగ్గాలి. లేకపోతే విషాదం తప్పదు. బేషరతుగా సరెండర్ అవ్వాలి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు. ప్రస్తుతానికి అతడిని మాత్రం మేం చంపబోవడంలేదు” అని పేర్కొన్నారు.

ఫోర్డో సైట్ ధ్వంసం..శాటిలైట్ ఫొటోలు విడుదల 

ఫోర్డో న్యూక్లియర్ సైట్ పై అమెరికా బాంబు దాడి అనంతరం తీసిన శాటిలైట్ ఫొటోలను ప్లానెట్ ల్యాబ్స్, పీబీసీ సంస్థలు రిలీజ్ చేశాయి. అమెరికా దాడికి ముందు, తర్వాత తీసిన శాటిలైట్ ఫొటోలను బట్టి చూస్తే.. ఫోర్డో సైట్ వద్ద బాంబు పేలుళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) వార్తా సంస్థ వెల్లడించింది. 

‘‘పర్వతంపై ఫోర్డో న్యూక్లియర్ సైట్ ఉన్న ప్రాంతం ఇంతకుముందు గోధుమ రంగులో ఉండగా.. ఇప్పుడు బూడిద రంగులోకి మారిపోయింది. అలాగే పర్వత ప్రాంతం రూపు రేఖలు స్వల్పంగా మారిపోవడం చూస్తే.. ఆ ప్రాంతం ధ్వంసమై పరిసరాల్లోకి శకలాలు ఎగిరిపడ్డట్టుగా తెలుస్తోంది. 

అంతేకాకుండా ఫోర్డో సైట్ లోపలికి వెళ్లేందుకు ఉన్న రెండు టన్నెల్ ఎంట్రీ పాయింట్లు కూడా మట్టితో మూసుకుపోయినట్టుగా శాటిలైట్ ఫొటోలను బట్టి తెలుస్తోంది. పర్వత ప్రాంతంలో బూడిద రంగు పొగ కూడా పెద్ద ఎత్తున వెలువడింది. వీటన్నింటిని విశ్లేషిస్తే.. అమెరికన్ బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించినట్టు తేలుతోంది” అని ఏపీ వివరించింది.

తగ్గకపోతే దాడులు తప్పవ్: పీట్ హెగ్సెత్ 

ఇరాన్ తో తాము యుద్ధాన్ని కోరుకోవట్లేదని, కానీ ఇంతటితో తగ్గకపోతే మరిన్ని దాడులు తప్పవని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. ఇరాన్ పై దాడుల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై దాడులు చేశాం. ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనో, లేదా ప్రభుత్వాన్ని మార్చాలనో ఈ దాడులు చేయలేదు. ఆ దేశ అణు కార్యక్రమాన్ని ఆపాలని మాత్రమే ఈ ఆపరేషన్ చేపట్టాం. ఈ దాడులతో ఇరాన్​అణు కార్యక్రమాన్ని నాశనం చేశాం. ఇంతటితో ఇరాన్ వెనక్కి తగ్గకపోతే మరిన్ని దాడులకు వెనకాడబోం” అని హెచ్చరించారు. 

‘‘ఇరాన్ కు ముందుగా అమెరికా అధ్యక్షుడు 60 రోజుల గడువు ఇచ్చారు. మాట వినకపోతే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఉండదని హెచ్చరించారు. అయినా విననందుకే ఇప్పుడు అన్న మాట ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమాన్ని అంతం చేశాం” అని హెగ్సెత్ అన్నారు. కాగా, ఈ దాడులకు కొన్ని నెలలుగా ప్లాన్ సిద్ధం చేశామని, కొన్ని వారాల ముందు నుంచే సన్నాహాలు చేశామన్నారు. 

అమెరికా పని సులువు చేసిన ఇజ్రాయెల్.. 

ఇరాన్ అణు బాంబును తయారు చేయకుండా అడ్డుకోవాలని సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తున్న అమెరికాకు తాజాగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధంతో పని సులువైంది. వారం రోజులుగా ఇజ్రాయెల్ లోని అణు కేంద్రాలు, ఇతర ప్రాంతాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయగా.. ఇరాన్ పెద్దగా ప్రతిఘటించలేకపోయింది. 

అయితే, అత్యంత పటిష్టమైన భద్రతతో, శత్రుదుర్భేద్యంగా ఓ పర్వతాన్ని తొలచి నిర్మించిన ఫోర్డో న్యూక్లియర్ సైట్ ను మాత్రం ఇజ్రాయెల్ టచ్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో అదను చూసి పక్కా ప్లాన్ వేసిన అమెరికా.. పర్వత గర్భంలో ఉన్న ఈ సైట్ ను శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబులతో పేల్చేసింది.  

బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంలోనూ పేలుళ్లు..

ఇరాన్ లోని బుషెహర్ లో ఉన్న ఏకైక అణు విద్యుత్ కేంద్రంలోనూ ఆదివారం మధ్యాహ్నం పేలుళ్లు సంభవించాయని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, ఈ పేలుళ్లకు కారణాలేంటన్నది వెల్లడికాలేదు. బుషెహర్ పోర్ట్ సిటీ సమీపంలో ఉన్న ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా సహకారంతో ఇరాన్ నిర్వహిస్తోంది. 

అర్ధరాత్రి ‘సుత్తి’ దెబ్బ.. 25 నిమిషాల్లో ఖేల్ ఖతమ్..     

ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ‘ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్’ పేరుతో చేపట్టిన మిషన్ మొత్తంగా 20 గంటల్లో ముగిసిందని అమెరికా ప్రకటించింది. ఇరాన్ లోకి ఎంట్రీ నుంచి ఔట్ వరకూ మొత్తం 25 నిమిషాల్లో తమ యుద్ధ విమానాలు పని ముగించుకొచ్చాయని వెల్లడించింది. ఈ ఆపరేషన్ వివరాలను అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ మీడియాకు వివరించారు.

 ముందుగా ఫోర్డో అణు కేంద్రంపై, ఆ తర్వాత మిగిలిన రెండు అణు కేంద్రాలపై బీ2 స్టెల్త్ బాంబర్ విమానాల ద్వారా సుమారు 15 వేల కిలోల చొప్పున బరువైన బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించినట్టు ఆయన వెల్లడించారు. అలాగే పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం నుంచి యూఎస్ఎస్ జార్జియా, యూఎస్ఎస్ ఫ్లోరిడా జలాంతర్గాముల ద్వారా 30 తొమహాక్ క్షిపణులను ప్రయోగించి నతాంజ్, ఇస్ఫహాన్ కేంద్రాలను ధ్వంసం చేశామన్నారు. 

ఈ ఆపరేషన్ లో ఏడు బీ2 స్టెల్త్ బాంబర్స్ తో సహా మొత్తం125 మిలిటరీ ప్లేన్స్ పాల్గొన్నాయని.. మొత్తం 14 జీబీయూ 57 బంకర్ బస్టర్ బాంబులు వేశామన్నారు.  జూన్ 22, తెల్లవారుజామున 4.10 గంటలకు మొదలైన ఆపరేషన్.. 4.35కు (ఇండియన్ టైం ప్రకారం) ముగిసిందన్నారు.   

రెండు వారాల్లో అని.. రెండ్రోజుల్లోనే 

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎంటరయ్యే అంశంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానంటూ ప్రపంచాన్ని ఏమార్చిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. రెండు రోజుల్లోనే ఇరాన్ పై అటాక్ చేశారు. అంతేకాకుండా.. తాను భారత్, పాక్ యుద్ధాన్ని ఆపినప్పటికీ, నోబెల్ శాంతి బహుమతి వస్తుందో, రాదోనంటూ దీర్ఘాలు తీసిన ఆయన ఆ మరునాడే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించి అవాక్కయ్యేలా చేశారు. కాగా, యురేనియం ఎన్ రిచ్ మెంట్ ప్లాంట్ గా వినియోగిస్తున్న ఫోర్డో అణు కేంద్రం ఇరాన్ లోని ఖోమ్ సిటీ ఏరియాలో ఉన్న ఓ పర్వతం దిగువన ఉంది. అలాగే భూ ఉపరితలంపైనే ఉన్న నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాల్లో యురేనియం ప్రాసెసింగ్, సెంట్రిఫ్యూజ్ అసెంబ్లీ వంటి పనులు నిర్వహిస్తున్నారు.

నాన్‌‌‌‌స్టాప్ 37 గంటలు.. గాల్లోనే ఇంధనం

ఇరాన్‌‌‌‌పై పక్కా ప్రణాళికతో అమెరికా దాడులు చేసింది. ఇందుకోసం బీ2 స్పిరిట్ బాంబర్ యుద్ధ విమానాలను వినియోగించింది. ఇవి నాన్‌‌‌‌స్టాప్‌‌‌‌గా 37 గంటల పాటు గాల్లోనే ప్రయాణించి అనుకున్న లక్ష్యాలను ఛేదించాయి. మధ్యలో పలుమార్లు గాల్లోనే ఇంధనాన్ని నింపుకున్నాయి. అమెరికాలోని మిస్సోరి నుంచి బయలుదేరిన బీ2 స్పిరిట్ బాంబర్లు.. పసిఫిక్ మహాసముద్రంలోని గ్వామ్ ఐలాండ్‌‌‌‌కు చేరుకున్నాయని, ఇక్కడి నుంచే ఇరాన్‌‌‌‌పై అమెరికా దాడులు చేసిందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇక్కడున్న యూఎస్ ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌ బేస్.. బీ2 స్పిరిట్ బాంబర్లకు ప్రధానమైన స్థావరంగా ఉంది.

ముందే యురేనియం ఖాళీ చేసిన ఇరాన్?

ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ కూడా ధ్రువీకరించింది. అయితే, మూడు చోట్ల నుంచీ ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని తెలిపింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను మాత్రం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. 

మూడు న్యూక్లియర్ సైట్ ల వద్ద అమెరికా బాంబు దాడి తర్వాత రేడియేషన్ విడుదలైనట్టు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని, పరిస్థితిని నిరంతరం మానిటర్ చేస్తున్నామని  ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) వెల్లడించింది. అయితే, కొన్ని రోజుల క్రితం ఫోర్డో సైట్ ఎంట్రెన్స్ వద్ద పెద్ద ఎత్తున ట్రక్కులు, వాహనాలు బారులు తీరిన విషయం కూడా శాటిలైట్ ఫొటోల్లో బయటపడింది. దీంతో అమెరికా దాడులను ముందే ఊహించిన ఇరాన్.. ఇదివరకే ఇక్కడి నుంచి యురేనియంను తరలించి ఉంటుందని భావిస్తున్నారు. 

మిస్టీరియస్‌‌ కాలర్‌‌‌‌ ట్యూన్లు

టెహ్రాన్: ఇరానియన్లకు ఫోన్‌‌ చేస్తే మిస్టీరియస్‌‌ కాలర్‌‌‌‌ ట్యూన్‌‌ వినిపిస్తోంది. ఇరాన్‌‌లో ఉన్న తమవాళ్ల గురించి ఆరా తీద్దామనుకుని బయటివాళ్లు కాల్‌‌ చేస్తే అంతుచిక్కని వాయిస్‌‌ వినిపిస్తోంది. అందులో ‘‘హలో.. హలో.. ఎవరు మాట్లాడేది? మీరు చెప్పేదేం వినిపించట్లేదు. అసలేం మాట్లాడుతున్నారో అర్థంకావట్లేదు”అంటూ 90 సెకన్లపాటు ఆటోమేటెడ్‌‌ వాయిస్‌‌ వస్తోంది. 

దీంతో ఫోన్‌‌ కాల్‌‌ చేసినవాళ్లు అయోమయానికి గురవుతున్నారు. ఇంకొంతమందికి ‘మీరు ఎవరో నాకు తెలియదు’ అనే వాయిస్‌‌, మరికొంతమందికి ‘ఇప్పటిదాకా వినడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు’ అని వాయిస్‌‌ వినిపిస్తోంది. రోబోటిక్‌‌ వాయిస్‌‌లో..  సమయం, శాంతి అంటూ జీవిత సత్యాలు, నీతిసూత్రాలు వల్లించిందని ఇంకొందరు చెప్తున్నారు. 

ఇరాన్‌‌ ప్రభుత్వం ఇంటర్నెట్‌‌ సర్వీస్‌‌లపై దేశవ్యాప్తంగా పరిమితులు విధించిన జూన్‌‌ 17 నుంచి ఈ వింత పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. ఇది ఇజ్రాయెల్‌‌ సైబర్‌‌‌‌ దాడేనని కొందరు ఎక్స్‌‌పర్ట్స్‌‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెట్‌‌వర్క్‌‌ అంతరాయం కారణమని మరికొందరు అంటున్నారు. ఇంటర్నెట్‌‌ కట్‌‌ చేశాక ఫోన్‌‌ కాల్స్‌‌ సరిగా కలవక డిఫాల్ట్ మెసేజ్ సిస్టమ్‌‌కు వెళ్తున్నాయని టెలికాం సర్వీస్‌‌ నిపుణులు చెప్తున్నారు.

ఇరాన్​లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు చేశాం. వాటిని పూర్తిగా నాశనం చేశాం. ఇది అమెరికాకు, ఇజ్రాయెల్​కు, మొత్తం ప్రపంచానికే చరిత్రాత్మకమైన క్షణం. ఈ యుద్ధాన్ని ఇరాన్ ఇప్పుడు తప్పకుండా ముగించి తీరాలి. లేకపోతే ఆ దేశానికి విషాదం తప్పదని  అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు.