
- ఐదేళ్ల వివరాలు తప్పనిసరి చేసిన అమెరికా
- గత ఏడాదే చేయాల్సి ఉన్నాతాజాగా అమలు
- నేషనల్ సెక్యూరిటీ కారణాలతో కొత్త విధానం
- తప్పుడు వివరాలిస్తే కఠిన చర్యలు
- దౌత్య, అధికారిక పర్యటనల వీసాలకు మినహాయింపు
- బిజినెస్ గ్రూప్ , వీసా పొడిగింపు, స్టేటస్ మార్పుకు కూడా
అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారా? వీసా అప్లికేషన్ నింపారా? ఇంటర్వ్యూలకు వెళుతున్నారా? ఓకే..
మీకు సోషల్ మీడియా అకౌంట్ ఉందా? అదేం పిచ్చి ప్రశ్న.. అదిప్పుడు చాలా కామన్ కదా అంటారా! అయినా, వీసాల గురించి చెప్పి మళ్లీ ఈ సోషల్ మీడియా వైపు ఎందుకు మాట మార్చినట్టు అంటారా? వీసా కావాలంటే ఇకపై మీ సోషల్ మీడియా హిస్టరీ కూడా చెప్పాలి కాబట్టి.
అవును, వలస విధానాలపై ఇప్పటికే చాలా గట్టిగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారు, ఇప్పుడీ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. వీసా అప్లై చేసుకునే రోజుకు ముందు ఐదేళ్ల నాటి సోషల్ మీడియా వాడకపు హిస్టరీని దరఖాస్తులో వివరించాలి. దేశ భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్ణయం పాతదే.. కానీ, ఇప్పుడే కొత్తగా దాన్ని అమలు చేస్తున్నారు. ఎప్పుడో ఏడాది క్రితం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు తాజాగా ఆమోదముద్ర పడిందన్నమాట. ఎన్ని సోషల్ మీడియా అకౌంట్లున్నాయో వాటన్నింటి యూజర్ నేమ్లు ఇవ్వాల్సి ఉంటుంది. స్టూడెంట్లు, జాబ్ కోసం వెళ్లేవాళ్లే కాదు, టూరిస్ట్ వీసా మీద వెళ్లేవాళ్లూ ఆ వివరాలను జత చేయాల్సి ఉంటుంది. ఈ జాబితా నుంచి దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారిక పర్యటనలకు సంబంధించిన వ్యక్తులను మినహాయించారు.
‘‘అమెరికా పౌరుల హక్కులను కాపాడేలా వీసా స్క్రీనింగ్ ప్రాసెస్ను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తున్నాం. చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే వాళ్ల విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు” అని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.47 కోట్ల మంది వీసా దరఖాస్తుల్లో తమ తమ సోషల్ మీడియా వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2018 సెప్టెంబర్ 30 నాటికి ఇండియాలోని అమెరికా కాన్సులేట్ 8.72 లక్షల వీసాలను జారీ చేసింది. ‘‘టూరిస్ట్ లేదా ఇమిగ్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వీసా ఈ–ఫారాలు డీ 160, డీ 260ల్లో సోషల్ మీడియా హిస్టరీని వెల్లడించాలి. డ్రాప్డౌన్ మెనూలో వాడుతున్న సోషల్ మీడియా అకౌంట్లు, వాటి యూజర్ నేమ్లను విధిగా పొందుపరచాలి. అప్లే చేస్తున్న డేట్కు ముందు ఐదేళ్ల వివరాలను సమర్పించాలి. పాస్వర్డ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు” అని రెడ్డి అండ్ న్యూమన్ అనే ఇమిగ్రేషన్ లా సంస్థ సహ యజమాని ఎమిలీ న్యూమన్ చెప్పారు.
అయితే, బిజినెస్ కోసం ఏర్పాటు చేసిన బిజినెస్ గ్రూప్ అకౌంట్ల వివరాలను మాత్రం వెల్లడించాల్సిన అవసరం లేదు. గత ఏడాది మార్చిలోనే ఈ కొత్త విధానాలను అమలు చేయాలని ట్రంప్ సర్కారు భావించినా, ఎంపిక చేసిన వీసా దరఖాస్తుదారులు మాత్రమే సోషల్ మీడియా వివరాలు వెల్లడించేలా నిబంధనలు సడలించింది. ఆ సడలించిన నిబంధనలతో కొత్త విధానాన్ని అమలు చేస్తోంది.
మనస్తత్వం తెలుసుకునేందుకే
దరఖాస్తు దారుడి మనస్తత్వం తెలుసుకునేందుకే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్టు కాలిఫోర్నియాకు చెందిన ఫ్రాగోమెన్ అనే ఇమిగ్రేషన్ లా సంస్థ తెలిపింది. ‘‘వ్యక్తి మనస్తత్వం, టెర్రరిస్టు కార్యకలాపాలను గుర్తించేందుకు వీలుగానే ట్రంప్ సర్కార్ ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. తద్వారా అలాంటి వాళ్లను దేశంలోకి రానివ్వకుండా చేయొచ్చని భావించింది” అని ఆ సంస్థ ప్రతినిధి మిషెల్ వెష్లర్ చెప్పారు. వీసా ఇంటర్వ్యూ టైంలో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ప్రశ్నలూ అడిగే అవకాశం ఉందన్నారు. ‘‘ఈ కొత్త విధానం వల్ల వీసాల జారీ ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కాన్సులేట్కు వీసాను తిరస్కరించే అధికార పరిధి మరింత పెరుగుతుంది. హెచ్4, ఎల్2 వీసాల (హెచ్1బీ, ఎల్1 వీసాదారుల భార్యలు, పిల్లలకు ఇచ్చే డిపెండెంట్ వీసా) విషయంలో తిరస్కరించకుండా మినహాయింపు ఉండేది. ఇప్పుడు వాటినీ తిరస్కరించే అధికారం కాన్సులేట్కు వస్తుంది. ఇప్పటికే వీసా నిర్ణయాల్లో కాన్సులేట్లదే తుది నిర్ణయం. కాన్సులేట్ అధికారులు వీసాను తిరస్కరిస్తే అడిగే అధికారం దరఖాస్తు దారుడికి లేదు” అని ఇమిగ్రేషన్ డాట్కం అనే కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ రాజీవ్ ఎస్ ఖన్నా చెప్పారు.
స్టేటస్, వీసా పొడిగింపులకు వర్తించదు
హెచ్1బీ వీసా గడువు పొడిగింపు, బీ1 (టూరిస్ట్) వీసా స్టేటస్ను ఎఫ్1 (స్టూడెంట్) వీసాగా మార్చుకోవడంపై ఈ కొత్త విధానం ఎలాంటి ప్రభావం చూపించదని, అది వీటికి వర్తించదని న్యూయార్క్లోని ఇమిగ్రేషన్ లాయర్ సైరస్ మెహతా చెప్పారు. దరఖాస్తుదారుల సోషల్మీడియా హిస్టరీని మాత్రమే అడుగుతారని, వారి ప్రైవసీకి వచ్చిన నష్టమేం లేదని న్యూమన్ చెప్పారు. దరఖాస్తుదారుడి వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటారని అన్నారు. పాస్వర్డ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ కాన్సూలేట్ అధికారులు అడగరని వివరించారు. అయితే, తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం ‘మోసం’ కింద పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటారని ఇమిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని అమెరికా పౌర హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ కొత్త నిబంధన వల్ల ఒరిగేదేంటని ప్రశ్నిస్తున్నాయి. సోషల్మీడియా అకౌంట్ల వివరాలు ఇచ్చినంత మాత్రాన వీసా విధానాలు పారదర్శకంగా ఉంటాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటున్నాయి.