- కేంద్ర హోం మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనరల్ ఎలక్షన్ అయిన వెంటనే జనాభా లెక్కింపు జరుగుతుందని, ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ‘‘దేవెగౌడ హయాం నుంచి మన్మోహన్ సింగ్ హయాం వరకూ మహిళా బిల్లు ఐదు సార్లు ఫెయిల్ అయింది. అప్పుడు బిల్లును ఎందుకు ఆమోదించుకోలేకపోయారు?” అని ప్రశ్నించారు. సెన్సస్, డీలిమిటేషన్ ఎందుకన్న ప్రతిపక్షాల అభ్యంతరాలకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఏ సీటును రిజర్వ్ చేయాలన్న విషయం డీలిమిటేషన్ కమిషన్ పరిధిలో మాత్రమే ఉంటుంది.
ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు జనాభా లెక్కల గణాంకాలే ప్రామాణికం. ఇక వచ్చే ఏడాది జనరల్ ఎలక్షన్ అయిన వెంటనే జనాభా లెక్కింపు, డీలిమిటేషన్ ప్రక్రియ షురూ అవుతుంది” అని ఆయన వివరించారు. ‘‘ఒకవేళ మేం మూడొంతుల సీట్లను రిజర్వ్ చేస్తే.. మీరే ప్రశ్నిస్తారు. వయనాడ్ లేదా హైదరాబాద్ సీటును రిజర్వ్ చేస్తే రాజకీయం అంటారు. అందుకే ఈ విషయాన్ని డీలిమిటేషన్ కమిషన్కు అప్పగించడమే మంచిది” అంటూ రాహుల్ గాంధీ కామెంట్లకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు.
‘కొందరు వ్యక్తులు దేశాన్ని సెక్రటరీలు నడుపుతారని అనుకుంటారు. కానీ గవర్నమెంట్ నడుపుతుందని నేను అనుకుంటున్నా. ప్రస్తుతం 85 మంది బీజేపీ ఎంపీలు, 29 మంది మంత్రులు ఓబీసీలే” అంటూ ఎద్దేవా చేశారు.