కర్నాటక ఎలక్షన్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ కషాయ జెండా ఎగురవేయాలని ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. కేసీఆర్ సర్కార్ పరిపాలనను ఎండగడుతోంది. తరచూ కేంద్ర మంత్రులు రాష్ర్టంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. క్యాడర్ లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఆయన పర్యటన ఇప్పటికే ఖరారైంది. బుధవారం (జూన్ 14వ తేదీన) సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. ఈ టూర్ లో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని అమిత్ షా కలవనున్నారు. వీరి భేటీ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు అనేదానిపై ఇంట్రెస్టింగ్ గా మారింది.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయ శంఖారావం పూరించాలనే లక్ష్యంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేశారు బీజేపీ అధిష్టానం పెద్దలు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 9ఏళ్లలో చేసిన అభివృద్ధిని మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా ఆయన వివరించనున్నారు.