- భారీగా పడ్డ ఏడీఆర్.. ఇంటెరిమ్ డివిడెండ్ రూ. 18
- లాభం రూ. 6,212 కోట్లు
- గైడెన్స్లో మరోసారి మార్పు
ముంబై : పెద్ద ఐటీ కంపెనీలలో ఒకటయిన ఇన్ఫోసిస్ లాభం రెండో క్వార్టర్లో కేవలం 3 శాతం పెరిగింది. ఇదే కాలానికి రెవెన్యూ 7 శాతం అధికమైంది. సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీకి రూ. 38,994 కోట్ల రెవెన్యూ మీద రూ. 6,212 కోట్ల నికర లాభం వచ్చింది. కంపెనీ ఒక్కో షేర్కు రూ. 18 చొప్పున ఇంటెరిమ్ డివిడెండ్ను ప్రకటించింది. ఈ ఫైనాన్షియల్ఇయర్కు గైడెన్స్ను మరోసారి కంపెనీ సవరించింది. 2023–24 లో రెవెన్యూ 1 నుంచి 2.5 శాతం మాత్రమే పెరగొచ్చని అంచనాలను విడుదల చేసింది. అంతకు ముందు ఇచ్చిన రెవెన్యూ గైడెన్స్లో రెవెన్యూ గ్రోత్ 1 నుంచి 3.5 శాతం దాకా ఉండే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.
సెప్టెంబర్ క్వార్టర్లో ఆపరేటింగ్ మార్జిన్స్ టార్గెట్(20–22 శాతం)ను ఇన్ఫోసిస్ నిలబెట్టుకోగలిగింది. సవరించిన ఇన్ఫోసిస్ గైడెన్స్ మార్కెట్ను నిరుత్సాహపరిచింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రీ మార్కెట్లో ఇన్ఫోసిస్ ఏడీఆర్లు (అమెరికన్ డిపాజిటరీ రిసీట్లు) 5 శాతం పతనమయ్యాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఎన్ఎస్ఈలో నూ గురువారం ట్రేడింగ్లో ఇన్ఫోసిస్ షేర్లు 2 శాతం తగ్గి రూ. 1,465.50 వద్ద క్లోజయ్యాయి.శుక్రవారం సెషన్లో కూడా ఈ షేరు మరింత పడే చాన్స్లు కనిపిస్తున్నాయి.
క్యూ2 హైలైట్స్....
- సెక్వెన్షియల్గా చూస్తే కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ దాదాపు 3 శాతం, నికరలాభం 4.5 శాతం ఎక్కువయ్యాయి.
- నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన రెవెన్యూ సెక్వెన్షియల్గా 2.3 శాతం అధికమైంది.
- తాజా క్వార్టర్లో 7.7 బిలియన్ డాలర్ల విలువైన పెద్ద డీల్స్ను చేజిక్కించుకుంది.
తగ్గిన ఉద్యోగుల వలస
మార్జిన్స్ పెంచుకునేందుకు అమలు చేస్తున్న ప్లాన్ ఫలితాలు ఇస్తోందని, క్యూ2 లో ఆపరేటింగ్ మార్జిన్ 21.2 శాతం వద్ద నిలబడటమే దీనికి నిదర్శనమని సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ చెప్పారు. టీసీఎస్లాగే ఇన్ఫోసిస్లోనూ ఉద్యోగుల వలస తగ్గింది. అంతకు ముందు క్వార్టర్లో 17.3 శాతంగా ఉన్న ఉద్యోగుల వలస, ఈ తాజా క్వార్టర్లో 14.6 శాతానికే పరిమితమైంది. సెప్టెంబర్ చివరి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,28,764 వద్ద నిలిచింది. నార్త్ అమెరికా బిజినెస్ ఒక్క శాతం పెరగ్గా, యూరప్ నుంచి మాత్రం 5.4 శాతం గ్రోత్ను కంపెనీ సాధించగలిగింది.