నవనీత్‌ కౌర్ దంపతుల బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌

నవనీత్‌ కౌర్ దంపతుల బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌

ముంబై : అమరావతి  స్వతంత్ర ఎంపీ నవనీత్‌ రాణా, రవి రాణా దంపతులపై ముంబై సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇద్దరూ(దంపతులు) బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని, వారి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. హనుమాన్‌ చాలీసా వివాదం నేపథ్యంలో నవనీత్‌ రాణా దంపతులకు మే 5వ తేదీన కోర్టు షరతులతో బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.

పోలీసుల పిటిషన్‌పై ఈ నెల 27న ముంబై సెషన్స్‌ కోర్టు విచారణ చేపట్టనున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్‌ చాలీసా చదువుతామని నవనీత్‌ కౌర్ రాణా దంపతులు ప్రకటించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. రాణా దంపతుల ప్రకటనతో శివసేన కార్యకర్తలు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఆ తర్వాత ఇద్దరిని ముంబై పోలీస్‌లు ఏప్రిల్‌ 23వ తేదీన అరెస్టు చేశారు. అనంతరం దంపతులిద్దరూ బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత ముంబై సెషన్స్‌ కోర్టు ఇద్దరికీ రూ.50వేల పూచీకత్తుతో పాటు పలు షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది. 

మీడియాతో మాట్లాడవద్దని, కేసు విచారణకు ఆటంకం కలిగించకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, బెయిల్‌ను రద్దు చేసేలాంటి క్రిమినల్ నేరానికి పాల్పడకూడదని న్యాయస్థానం ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఇద్దరిని విచారించాలంటే.. 24 గంటల ముందుగా నోటీసులు ఇవ్వాలని పోలీసులకు కోర్టు సూచించింది.