న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరగబోయే జీ–20 సమిట్కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు సంబంధించి సలహాలు, సూచనలు, చర్చలు, వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్రం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. మొత్తం 40 పార్టీల ప్రెసిడెంట్లకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం పంపించారు. రాష్ట్రపతి భవన్లో జరగబోయే ఈ మీటింగ్కు ప్రధాని నరేంద్ర మోడీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా అటెండ్ అవుతారు. ఇప్పటికే జీ20 సదస్సుకు సంబంధించిన లోగో, వెబ్సైట్ను కేంద్రం రూపొందించింది. ఇండియా అధికారికంగా డిసెంబర్ 1న జీ–20 ప్రెసిడెన్సీని స్వీకరించింది. డిసెంబర్లో జీ–20 సన్నాహక సమావేశాలు ప్రారంభం అవుతాయి. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 200 చోట్ల మీటింగ్లు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు కేంద్రం తీసుకుంటుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ–20 సమిట్ జరగనుంది. ఈ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు హాజరవుతారు.
టీఎంసీ చీఫ్ హోదాలో దీదీ హాజరు
ఆల్ పార్టీ మీటింగ్ కోసం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. తాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి హోదాలో అఖిలపక్షం సమావేశానికి అటెండ్ అవుతున్నానని, సీఎం హోదాలో కాదని తెలిపారు. ఇండోనేసియా రాజధాని బాలీలో ఇటీవల జరిగిన జీ20 సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోడీ సదస్సు అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు. జీ-20 లేదా.. ‘గ్రూప్ ఆఫ్ 20’ అనేది ప్రపంచంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్గత ఉమ్మడి వేదిక. ఈ జీ20లో ఇండియా, అమెరికా, రష్యా, చైనా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్యదేశాలుగా ఉన్నాయి.