ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగమార్గం కూలిపోయింది. దీంతో 36 మంది కార్మికులు (Workers) అందులో చిక్కుకుపోయారు. బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుంచి దండల్గావ్ వరకు సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు.
శనివారం (నవంబర్ 11) రాత్రి టన్నెల్ ఒక్కసారిగా కూలిపోవడంతో దాదాపు 36 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. శిథిలాలు పూర్తిగా కప్పేయడంతో వారికి బయటకు రావడానికి మార్గం లేకుండా పోయింది.
సమాచారం అందుకున్న కేంద్ర, రాష్ట్ర డిశాస్టర్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. టన్నెల్కు సమాంతరంగా డ్రిల్లింగ్ చేసి సొరంగంలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. కార్మికులను బయటకు క్షేమంగా తీసుకొచ్చేందుకు శిథిలాలను తొలగిస్తున్నారు.
ఈ ప్రక్రియ అంతా పూర్తయేందుకు రెండు నుంచి మూడు రోజులు పట్టొచ్చని ఉత్తరకాశి ఎస్పీ అర్పన్ యదువంశి చెప్పారు. టన్నెల్ ఆరంభం నుంచి 200 మీటర్ల దూరంలో కూలిపోయిందని తెలిపారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, వీలైన త్వరలో చిక్కుకుపోయినవారిని క్షేమంగా బయటకు తీసుకొస్తామన్నారు.