వాళ్ల కోసం ప్రత్యేక నెంబర్ ఇచ్చిన ప్రభుత్వం

వాళ్ల కోసం ప్రత్యేక నెంబర్ ఇచ్చిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) స్వాభిమాన్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ హెల్ప్‌లైన్ నంబర్ 1091ను ప్రారంభించింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డిపద్మ మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో దీనిని ప్రారంభించారు. ప్రత్యేకంగా కేటాయించిన హెల్ప్‌లైన్ నంబర్.. ట్రాన్స్‌జెండర్ల మానసిక, ఇతర సమస్యలను పరిష్కరించడంతో పాటుగా భద్రతను పెంపొందించడానికి, హక్కులను రక్షించేందుకు ఉద్దేశించబడింది. ఈ హెల్ప్‌లైన్‌ను ఏపీ సీఐడీ అదనపు డీజీపీ ఎన్ సంజయ్ ప్రతిపాదించారు.

 ట్రాన్స్‌జెండర్స్‌ ఫిర్యాదులు స్వీకరణ 

రాష్ట్ర స్ధాయి ట్రాన్స్‌ జెండర్‌ పర్సన్స్‌ ప్రొటెక్షన్‌సెల్‌ నోడల్‌ అధికారిగా సీఐడి ఎస్పీ కెజీవి సరితను నియమించారు. స్వాభిమాన్‌ ద్వారా ట్రాన్స్‌జెండర్స్‌ ఫిర్యా దులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సీఐడి పని చేస్తుందని తెలిపారు. కౌన్సిలింగ్‌తోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు ట్రాన్స్‌జండర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న సంక్షేమపథకాలను వివరించారు.

లింగమార్పిడి వ్యక్తుల భద్రత, గౌరవాన్ని కాపాడటం, దుర్వినియోగం, శారీరక హింసతో సహా వారిపై వివక్షను నిరోధించడం, వారి హక్కులను పరిరక్షించడం, వారిపై నేరాల కేసులను పర్యవేక్షించడం, చట్టపరమైన తీసుకోవడం కోసం ఏర్పాటు చేశారు. 

లింగమార్పిడి వ్యక్తుల (రక్షణ నియమాలు) చట్టం-2019, లింగమార్పిడి వ్యక్తుల (రక్షణ నియమాలు)-2020 ప్రకారం ఈ హెల్ప్‌లైన్ పని చేస్తుందని సరిత తెలిపారు. దీని ద్వారా ట్రాన్స్‌జెండర్ల ఫిర్యాదులను విశ్లేషించి, కౌన్సెలింగ్, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది టోల్ ఫ్రీ నంబర్ అని.. ఎలాంటి ఛార్జీలు ఉండవని ట్రాన్స్‌జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.