హైదరాబాద్, వెలుగు: చైనా వెళ్లొచ్చిన ముగ్గురు వ్యక్తులు శనివారం దగ్గు, జలుబు లక్షణాలతో హెల్త్ డిపార్ట్ మెంట్ ను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఈ ముగ్గురినీ ఫీవర్ హాస్పిటల్లోని కరోనా వైరస్ ఐసోలేటెడ్ వార్డులో అబ్జర్వేషన్లో ఉంచామని హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. శుక్రవారం చేరిన నలుగురితో పాటు శనివారం వచ్చిన ముగ్గురి శాంపిళ్లను పుణెకు పంపించామని, రిజల్ట్ రావాల్సి ఉందని నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్కుమార్ తెలిపారు. ఏడుగురిలో ముగ్గురు మాత్రమే హాస్పిటల్లో ఉండగా, మిగతా నలుగురిని ఇంటికి పంపించారు. ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటామని చెప్పడంతో పంపించామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రాష్ర్టం నుంచి 18 మంది శాంపిళ్లను పుణెకు పంపించగా, 11 మందికి వైరస్ సోకలేదని తేలింది. గాంధీ హాస్పిటల్లో సోమవారం నుంచి కరోనా టెస్టులు చేస్తామని హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ ప్రకటించారు. ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా పుణెకు శాంపిళ్లను పంపిస్తుండడంతో రిజల్ట్ వచ్చే వరకు ఆలస్యమవుతోంది. గాంధీలో టెస్టులు ప్రారంభమైతే ఐదారు గంటల్లోనే రిజల్ట్ వస్తుందని చెప్పారు. మరోవైపు శనివారం వుహాన్ నుంచి వచ్చిన ఫ్లైట్ లో తెలంగాణకు చెందిన వారు నలుగురైదుగురు మాత్రమే ఉన్నారని అధికారులు తెలిపారు.
చైనాలో ఇండియన్లను అడ్డుకున్నరు
బీజింగ్: చైనాలోని వుహాన్ నుంచి 324 మంది ఇండియన్లు శనివారం ఉదయం భారత్ కు వచ్చారు. ప్రాణాంతక వైరస్ వ్యాపిస్తున్న హ్యూబీ ప్రావిన్స్ నుంచి వీళ్లు స్పెషల్ ఫ్లైట్లో న్యూఢిల్లీకి చేరుకున్నారు. అదే విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన మరో ఆరుగురిని ఇమిగ్రేషన్ ఆఫీసర్లు అడ్డుకున్నారు. హైఫివర్తో బాధపడుతున్నందునే వాళ్లను అడ్డుకున్నట్లు చెప్పారు. వారిలో కరోనా వైరస్ లక్షణాలను కనుక్కోవడానికి టెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయి.ప్రావిన్స్లో మిగిలిపోయిన మనోళ్లను తీసుకొచ్చేందుకు మరో ఫ్లైట్ అక్కడికి చేరుకుంది. కరోనా వల్ల చనిపోయినోళ్ల సంఖ్య 259కి, కన్ఫర్మేషన్ కేసులు 11,791కి చేరాయి.