గంజాయి మత్తులో దారుణాలు..జాడలేని ఆంటీ డ్రగ్ కమిటీ

గంజాయి మత్తులో  దారుణాలు..జాడలేని ఆంటీ డ్రగ్ కమిటీ

రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటున్నది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా పాన్​డబ్బాలు మొదలుకొని కిరాణా షాపుల దాకా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ గంజాయి దొరుకుతున్నది. పాత నేరస్తులను పోలీసులు టార్గెట్​ చేస్తుండడంతో.. స్టూడెంట్లను గంజాయి స్మగ్లర్స్ లక్ష్యంగా చేసుకుంటున్నారు.

గంజాయికి బానిసైనోళ్లు మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. మర్డర్లు, రేప్​లు చేస్తున్నారు. జగిత్యాలలోని ఓ హైస్కూల్​లో చదివే బాలిక తోటి స్టూడెంట్ల ద్వారా గంజాయికి అలవాటు పడింది. ఈ క్రమంలో గంజాయి ఆశచూపి ఆమెపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తండ్రి అనుమానంతో ఆరా తీయగా విషయం బయటకు వచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ముందుగా డీఅడిక్షన్ సెంటర్ కి, అక్కడి నుంచి కరీంనగర్​లోని సేఫ్ హోమ్​కు తరలించి ట్రీట్​మెంట్​చేయిస్తున్నారు. ఇటీవల వెలుగుచూసిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. 

ఈ నెల 25న ఎటపాక మండలం వెంకటరెడ్డిపేటలో భద్రాచలానికి చెందిన యువకులు గంజాయి మత్తులో ఏపీకి చెందిన ముగ్గురిని కత్తితో పొడవగా ఆజ్మీరా సాయికుమార్​(15)అనే బాలుడు చనిపోయాడు. ఫిబ్రవరి 15న నిజామాబాద్​చంద్రశేఖర్​కాలనీలో సోనూ అనే వ్యక్తి జలీల్​ఖాన్​అనే వ్యక్తిని కొట్టి చంపాడు. ఫిబ్రవరి 16న నిజామాబాద్​పాత కలెక్టరేట్​ఏరియాలో అజయ్​అనే వ్యక్తి గౌస్​పాషా అనే యువకుడిని కత్తితో పొడిచాడు.  పోలీసులు ఆరా తీస్తే వీరిద్దరూ గంజాయి మత్తులోనే ఈ దారుణాలకు పాల్పడ్డారని తెలిసింది. ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఏదో ఒక మూలన జరుగుతుండడం కలవరపెడుతున్నది. 

జాడ లేనియాంటీ డ్రగ్​కమిటీలు..

గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల నిర్మూలన కోసం జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జిల్లా స్థాయిలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్(ఎన్సీఓఆర్డీ) కమిటీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం 2019లో నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి కమిటీకి సీఎస్, జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి మూడు  నెలలకోసారి, జిల్లా స్థాయిలో ప్రతి నెలా కమిటీలు సమావేశం నిర్వహించి గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల నివారణపై తీసుకుంటున్న చర్యలపై చర్చించాల్సి ఉంటుంది.

కానీ రాష్ట్ర స్థాయిలో తప్ప జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయలేదు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీల తరహాలో యాంటీ డ్రగ్ కమిటీ(ఏడీసీ)లను కూడా ఏర్పాటు చేయాలని గతంలోనే ఉన్నత విద్యాశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 174 కాలేజీల్లో మాత్రమే ఏడీసీలను ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లాకు ఒకట్రెండు చొప్పున 16 జిల్లాల్లో కలిపి 22 కమిటీలే ఏర్పాటు చేయడం గమనార్హం.

3 నెలల్లో 2,200 కిలోలు సీజ్ 


గత మూడు నెలల్లో 2,200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 70 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టుకున్నారు. 284 కేసులు నమోదు చేసి 400 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 1.25 కిలోల హాష్​ఆయిల్, 3.27 కిలోల ఓపియం, 60.2 గ్రాముల చారాస్ స్వాధీనం చేసుకున్నారు. 101 వాహనాలు సీజ్ చేశారు.