ఏపీలో ఇవాళ ఒక్క రోజే 7,943 కొత్త కేసులు

 ఏపీలో ఇవాళ ఒక్క రోజే 7,943 కొత్త కేసులు
  • తగ్గుముఖం పడుతున్న కొత్త కేసులు
  • కొనసాగుతున్న మరణాల ఉధృతి..
  • గడచిన 24 గంటల్లో 98 కరోనా మరణాలు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత నాలుగైదు రోజుల సగటు కంటే ఇవాళ మరీ తక్కువగా అంటే 7 వేల 943 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో 83 వేల 461 మందికి పరీక్షలు చేయగా వీరిలో 7 వేల 943 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మరో వైపు కరోనా  మరణాల ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు ఇంచుమించు వందకు పైగా కేసులు నమోదవుతున్న నేపధ్యంలో గడచిన 24 గంటల్లో 98 కరోనా మరణాలు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మరణాలను పరిశీలిస్తే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 15 కరోనా మరణాలు నమోదయ్యాయి. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో 11 మంది చనిపోయిన ఘటన జరిగింది మొదలు చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో నమోదవుతూ వస్తున్నాయి. ఇవాళ కూడా 15 మరణాలతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలువగా 12 మరణాలతో పశ్చిమ గోదావరి రెండో స్థానంలో నిలిచింది. తర్వాత ప్రకాశం జిల్లాలో 10 మంది, అనంతపురం జిల్లాలో 9 మంది, తూర్పు గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో 8 మంది చొప్పున, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, కృష్ణ, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప జిల్లాలో ముగ్గురు చొప్పున కరోనా సోకి కోలుకోలేక కన్నుమూశారు. 
మరో వైపు గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల 845 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లిపోయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కరోనా కొత్త కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.