ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన 711 ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారు. వీరి తరఫున కొంతమంది ప్రతినిధులు ఇవాళ(బుధవారం) సీఎం జగన్ను కలిసి తెలంగాణ ప్రభుత్వంలో సర్వీసులు కొనసాగించేందుకు వీలుగా తమను రిలీవ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్.. వారిని రిలీవ్ చేసేందుకు అంగీకారం తెలిపారు. ఆ తర్వాత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. సొంతరాష్ట్రానికి వెళ్తున్న ఉద్యోగులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమను రిలీవ్ చేయడంతో తెలంగాణ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.