అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు జూన్ 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు తదితర అన్ని యాజమాన్యాలలో గల స్కూళ్లలో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ఈనెల 30తో ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రభుత్వం సెలవులను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. కరోనా అదుపులోకి రాని పరిస్థితులు, టీచర్లు అనేక మంది కరోనా బారినపడి చనిపోతుండడంతో విద్యారంగంలో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో అన్ని వర్గాల సూచనల మేరకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది.
అయితే టీచర్లు, ప్రధానోపాధ్యాయులు మాత్రం పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యే పరిస్థితులు లేకపోవడం.. ప్రత్యక్ష క్లాసులు ఇప్పట్లో మొదలుపెట్టడం ప్రమాదకరంగా కనిపిస్తుండడంతో విద్యార్థులకు డీడీ, రేడియో, యూట్యూబ్ వంటి మాధ్యమా ద్వారా ఆన్లైన్లో క్లాసులు నిర్వహించడానికి వీలుగా ప్రణాళికల సిద్ధం చేయాలని SCERT డైరెక్టర్ను ఆదేశించింది. జూన్ 12వ తేదీ నుంచి అన్ని క్లాసులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పదో తరగతి విద్యార్థులకు ఆయా స్కూల్స్ హెడ్ మాస్టర్లు జూన్ 1వ తేదీ నుంచే అవసరమై విద్యాపరమైన సహాయం అందిస్తూ పర్యవేక్షణ చేయాలని ఆదేశించింది.