ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబెషన్ పూర్తి కావొస్తుండటంతో శాఖాపరమైన పరీక్షలు నిర్వహించేందుకు APPSC సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 28 నుంచి 30 వరకు 3 రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈనెల 13 నుంచి 17 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. APPSC వెబ్సైట్లో OTP ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సచివాలయ ఉద్యోగులకు సూచించింది. OTP ద్వారా వచ్చే యూజర్ ఐడీతో ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం కల్పించినట్టు స్పష్టం చేసింది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామని.. అందులో 40 మార్కులు వస్తేనే ప్రొబెషనరీకి అర్హులుగా నిర్ధారించనున్నట్టు APPSC తెలిపింది.
మరోవైపు 2021 అక్టోబర్ 2వ తేదీ నాటికి గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై రెండేళ్లు పూర్తి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగులకు ప్రోబెషన్ పూర్తి కానుంది.