
గ్వాంగ్జూ (సౌత్ కొరియా): ఇండియా రికర్వ్ ఆర్చర్లు.. వరల్డ్ చాంపియన్షిప్లో మరోసారి నిరాశపర్చారు. బుధవారం జరిగిన విమెన్స్ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ మ్యాచ్లో దీపికా కుమారి–గాథా ఖడకే–అంకిత భాకట్తో కూడిన ఇండియా త్రయం 3–5తో సౌత్ కొరియా చేతిలో ఓడి పతకానికి దూరమైంది. గురి తప్పకుండా బాణాలు వేసిన కొరియన్లు సొంతగడ్డపై పూర్తి ఆధిపత్యం చూపెడితే.. ఇండియా ఒక్క పరిపూర్ణమైన సెట్ను కూడా సాధించలేకపోయింది. ఓపెనింగ్ సెట్ను 51–54తో చేజార్చుకున్న ఇండియా రెండో సెట్ను 57–57తో సమం చేసింది.
మూడో సెట్ను 57–54తో ముగించి 3–3తో పతకంపై ఆశలు రేపింది. కానీ ట్రిపుల్ ఒలింపియన్ అన్సాన్–లిమ్ సిహ్యోన్ నాలుగో సెట్లో ఏమాత్రం గురి తప్పలేదు. 56–54తో తమ ఆధిపత్యాన్ని చూపెట్టారు. మిక్స్డ్ టీమ్లోనూ దీపిక–నీరజ్ చౌదరి నిరాశపర్చారు. ప్రిక్వార్టర్స్ షూటాఫ్లో 4–5 (18–19)తో ననామి అసుకునో–యుకీ కవాట (జపాన్) చేతిలో కంగుతిన్నారు. మెన్స్ ఆర్చర్లు కూడా వ్యక్తిగత, కాంపౌండ్ విభాగాల్లో నిరాశపర్చారు.