రోడ్డు ప్రమాదాలు జరగని రోజు ఉండదు. ఎక్కువమంది చనిపోయినప్పుడు ఆ వార్తని ప్రజలు పట్టించుకుంటారు. అది కూడా కొంచెం సమయం మాత్రమే. ఆ తరువాత వాళ్ల రొటీన్లోకి వెళ్లిపోతారు. బాగా డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తులు, వాళ్ల పిల్లలు రోడ్డు ప్రమాదం చేసినప్పుడు అవి తీవ్రమైన చర్చకు దారితీస్తాయి. వాళ్ల జవాబుదారీతనం మీద అనుమానాలు వ్యక్తమవుతాయి. పోలీసులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. విలాసవంతమైన కార్ల ప్రమాదంలో సాధారణంగా ఆ వాహనంలోని వ్యక్తులకు ఏమీ కాదు. వాళ్లు ఎక్కువ శాతం సురక్షితంగానే ఉంటారు. బలైపోయేది పాదచారులు. ఇతర మామూలు వాహనాల్లోని వ్యక్తులు. విలాసవంతమైన కార్ల ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అప్పటి మంత్రి పి. నారాయణ కుమారుడు నిషిత్. ఆ ప్రమాదం జూబ్లీహిల్స్లోని రోడ్ నెం. 36లోని పిల్లర్ 9కి గుద్దుకుని జరిగింది. ఆ మెర్సిడెస్ స్పోర్ట్స్ వాహనం వల్ల జరిగిన ప్రమాద తీవ్రత మరీ ఎక్కువ. దాని గేర్ బాక్స్ వాహనం నుంచి బయటకు వచ్చింది. ఉదయం 2.41 నిమిషాల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాద స్థలానికి ప్రముఖులు తక్షణం చేరుకున్నారు. అవసరమైన సహాయం చేశారని అంటారు.
ప్రముఖుల ప్రమాదాలు ఎప్పుడు జరిగినా, ఏ సమయంలో జరిగినా వారికి రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. కానీ మామూలు వ్యక్తులకు అవి లభించవు. విలాసవంతమైన కార్లు తరచుగా అధికారం, హోదా, వేగాలకి ప్రతీకలుగా నిలుస్తాయి. కొని సందర్భాల్లో విషాదాన్ని కూడా కలిగిస్తాయి. అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వ్యక్తులను భయపెట్టడానికి, కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, ఢీకొట్టి పారిపోయే కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి వ్యక్తుల మరణానికి కారకులైతే వారిని గతంలో సెక్షన్ 304ఎ, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ప్రాసిక్యూట్ చేసేవాళ్లు. ఆ నేరానికి రెండు సంవత్సరాల వరకు జైలుశిక్షనుగానీ, జరిమానానుగానీ, లేదా రెండింటినీగానీ కోర్టులు విధించే అవకాశం ఉండేది. ఆ చట్టం స్థానంలో కొత్తగా వచ్చిన భారతీయ న్యాయసంహితలోని సె.106(1)లో శిక్షార్హమైన నేరంగా చేశారు. రెండు సంవత్సరాల శిక్షాకాల నుంచి 5 సంవత్సరాల వరకు పెంచారు. అయితే ఇవి బెయిలబుల్ నేరాలు. బెయిలు పొందడమనేది ముద్దాయి హక్కుగా కలిగి ఉంటాడు. తాగిన మత్తులోగానీ, మాదక ద్రవ్యాల మత్తులో ఉండి ఎవరైనా ప్రమాదం చేసేవారిని గతంలో సె.105 భారతీయ న్యాయ సంహిత ప్రకారం ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. దానికి జీవిత ఖైదుని శిక్షగా విధించే అవకాశం ఉంది. కనీస శిక్ష 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కోర్టులు విధించవచ్చు.
అత్యంత ప్రముఖమైన విలాసవంత కారు ప్రమాదాలు
1999 జనవరి 10న ఢిల్లీలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ముగ్గురు పోలీసు అధికారులతో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు. నావల్ చీఫ్ మనవడు, ఆయుధ డీలర్ సురేష్ నందా కుమారుడు సంజీవ్ నందా ఈ కేసులో ముద్దాయి. ప్రమాదం చేసిన వాహనం బీఎండబ్ల్యూ. ప్రమాదం జరిగిన తరువాత నందా ప్రమాదస్థలం నుంచి పారిపోయాడు. కారు శుభ్రం చేసి సాక్ష్యాలు లేకుండా చేశారు. కేసులో చాలామంది సాక్షులు ప్రాసిక్యూషన్కి ప్రతికూలంగా మారిపోయారు. కేసుని విచారించిన సెషన్స్ కోర్టు నందాకి సె.304 (11) ప్రకారం శిక్ష నిర్ధారించిన ఐదు సంవత్సరాలు శిక్షను ఖరారు చేసింది. అప్పీలును విచారించిన ఢిల్లీ హైకోర్టు సె.304 (11) ప్రకారం కాకుండా సె.304 ప్రకారం నిర్ధారించి రెండు సంవత్సరాలకు తగ్గించింది. అయితే 2012వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను పునరుద్ధరించింది. కానీ శిక్షని రెండు సంవత్సరాలకే పరిమితం చేసి 50 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేయాలని, ఆ సొమ్ము రోడ్డు ప్రమాద బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలని ఆదేశించింది.
పూణే పోర్షే కేసు 2024
పూణేలోని కల్యాణి నగర్లో పోర్షే కారు ప్రమాదం చేసి ఇద్దరు ఐటీ నిపుణులను ఢీకొట్టి చంపింది. 17 సంవత్సరాల మైనర్ కారు నడుపుతున్నాడని ఆరోపణ. సాక్ష్యాలను తారుమారు చేయడానికి, నిందను తనపై వేసుకోమని కుటుంబ డ్రైవర్పై ఒత్తిడి తెచ్చినట్టు దర్యాప్తులో తేలడంతో ఆ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
కాన్పూర్ లంబోర్ఘిని ప్రమాదం (2026)
పొగాకు వ్యాపారి కుమారుడు శివమిశ్రా లంబోర్ఘిని నడిపి ప్రమాదం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం మిశ్రాను డ్రైవర్ సీటు నుంచి లాగారు. కానీ అతని కుటుంబ సభ్యులు మాత్రం కిరాయి డ్రైవర్ నడుపుతున్నాడని వాదించారు.
సల్మాన్ఖాన్ హిట్ అండ్ రన్ (2002)
ఫుట్పాత్పై నిద్రిస్తున్నవారిపైకి తన ఎస్యూవీని నడపడంతో ఒకరు మరణించారు. తాను వాహనం నడపలేదన్న విషయం మీద సంవత్సరాల తరబడి న్యాయపోరాటం జరిగింది. చివరికి సాక్ష్యాలలో పొంతన లేదని 2015లో బొంబే హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది.
ముంబై బీఎండబ్ల్యూ ప్రమాదం (2024)
ముంబైలో ఒక విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారు అతివేగంతో ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. శివసేన నాయకుడి కుమారుడు మిహర్షాను అరెస్టు చేశారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఢీకొట్టిన తరువాత నేరస్తుడు ఆపకుండా దూసుకువెళ్లాడు. ఆ మహిళ కారు బోనెట్పై కొంతదూరం లాగబడటమే కాకుండా సుమారు 1.5 కిలోమీటర్లు మేర కారు చక్రాల మధ్య చిక్కుకుపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి.
సీనియర్ ఐపీఎస్ అధికారి నిజాయితీ
ప్రమాదం జరిగింది మూడు గంటల ప్రాంతంలో (15.10). ప్రమాదం జరిగిన తరువాత బాధితురాలిని తన కారులోనే హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడని అంటున్నారు. ఇలాంటి కేసులు హాస్పిటల్కు రాగానే పోలీసులకి సమాచారం ఇస్తారు. దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. అలా జరగలేదు. నేరం జరిగింది. ప్రముఖమైన ప్రదేశంలో.. ఆ సమాచారం పోలీసులకి క్షణంలో తెలుస్తుంది. ఆ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఇలాంటి హై ప్రొఫెల్ కేసుల్లో ముద్దాయిని తారుమారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ కేసులో అలా జరగలేదు. ఓ పత్రిక కథనం ప్రకారం అలా జరగకపోవడానికి కారణం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి. ఈ హై ప్రొఫెల్ వ్యక్తుల వల్ల నేరాలు జరిగినప్పుడు పోలీసుల మీద ఒత్తిడి ఉంటుంది. వాటిని తట్టుకున్నందుకు పోలీసులని అభినందించాల్సిందే. కొన్ని సందేహాలను తీరిస్తే పోలీసుల మీద గౌరవం ఇంకా పెరుగుతుంది.
ఇన్ ఆర్టిట్మాల్ దగ్గర ఏం జరిగింది?
ప్రథమ సమాచార నివేదిక ప్రకారం ఆగస్టు 16న ఇన్ ఆర్బిట్మాల్ దగ్గర కారు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 20 సంవత్సరాల భారవి ముఖి అన్న యువతి మృతి చెందింది. భారత ముఖి లైఫ్ స్టైల్ స్టోర్లో సేల్స్గర్ల్గా పనిచేసేది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆ యువతి రోడ్డు దాటుతుండగా ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ, జనసేన నాయకుడు లింగమనేని రమేష్ కుమారుడు 21 సంవత్సరాల లింగమనేని సంజూష్ అదేకారులో హాస్పిటల్కు తరలించాడని, అక్కడ ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
నిర్లక్ష్యంగా లేదా అజాగ్రత్తగా కారు నడపడం వల్ల మరణం సంభవించినప్పుడు అది సె.106 (యు) ప్రకారం నేరమవుతుంది. అది బెయిలబుల్ నేరం. ఐదు సంవత్సరాల వరకు శిక్షను విధించవచ్చు. అది నేరపూరిత హత్య అయినపుడు మాత్రమే అది సె.105 భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరమవుతుంది. అది నాన్ బెయిలబుల్ నేరం. అందుకని అవసరమైన కొన్ని పరీక్షలు నిర్వహించి అతడిని వదిలిపెట్టినట్టుగా వార్తలు. ఇంతవరకు బాగానే ఉంది. ఎన్డీటీవీ ప్రసారం చేసిన వీడియోలో ముద్దాయి ఆ ప్రమాదాన్ని చాలా క్యాజువల్గా తీసుకున్నట్టు అనిపించింది. అతి అతను ఏవిధంగా తీసుకున్నా సె. 106 (1) ప్రకారం నేరం అయినట్టుగా అనిపిస్తుంది. కానీ కొన్ని సందేహాలు ప్రజల్లో సాంఘిక మాధ్యమాల్లో చోటుచేసుకున్నాయి. 16వ తేదీ నుంచి 21–8–2026 దాకా ఈ ప్రమాద ఉదంతం ప్రాముఖ్యతని సంతరించుకోలేదు. ఈ కేసులో ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడు. అయినా అతని పేరు ఇన్ని రోజులుగా బయటకు రాకపోవడం విచిత్రం. నేరం జరిగిన రోజే ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ఎఫ్ఐఆర్ను చూస్తే అనిపిస్తుంది. కానీ ఆ రోజే నమోదు అయ్యిందా, ఆ తరువాత నమోదు అయ్యిందా అనేది సందేహం.
- డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్)
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
