- కలెక్టర్ ఇలా త్రిపాఠి
- ఆర్మూర్ ఏరియా హాస్పిటల్ తనిఖీ
ఆర్మూర్, వెలుగు : వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం ఆర్మూర్ టౌన్ లోని ఏరియా హాస్పిటల్ ను తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్స్ లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర చికిత్స చేయాలంటే డాక్టర్లు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇలాంటి ధోరణి మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అవుట్, ఇన్ పేషెంట్ విభాగాలు, ఆపరేషన్ థియేటర్, సర్జరీ వార్డు, రిసెప్షన్ కౌంటర్లను పరిశీలించారు. రోజుకు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు.. ఎంత మంది అడ్మిట్అవుతున్నారు.. సరిపడా సిబ్బంది ఉన్నారా... మందులు ఉన్నాయా.. అంటూ ఆరా తీశారు. నార్మల్ డెలివరీలు చేస్తున్నారా, సిజేరియన్లు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా ఉన్నారు. -
