హైదరాబాద్ అబిడ్స్ లోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో జేఈఈ మెయిన్స్ పరీక్ష శుక్రవారం ఉదయం గంటన్నర ఆలస్యంగా (10.30 గంటలకు) ప్రారంభమైంది. ఇంటర్నెట్ సమస్య వల్ల ఉదయం జరిగిన పరీక్షలో 26 ప్రశ్నలు డిస్ ప్లే కాలేదు. మధ్యాహ్నం పరీక్ష పూర్తిగా వాయిదా పడింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈనేపథ్యంలో అరోరా కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ శుక్రవారం సాయంత్రం స్పందించారు. సర్వర్ ప్రాబ్లమ్ తో ఈ సెంటర్ లో ఎగ్జామ్ వాయిదా వేసినట్లు వెల్లడించారు. మళ్ళీ ఎప్పుడు పరీక్ష నిర్వహించాలనేది NTA నిర్ణయిస్తుందని తెలిపారు. 30వ తేదీన ఇతర ఎగ్జామ్స్ లేకుంటే .. ఆ రోజున పరీక్ష నిర్వహించే అవకాశం ఉందన్నారు. పరీక్ష మిస్ అయిన విద్యార్థులు ఆందోళన చెందొద్దని సూచించారు. మళ్లీ పరీక్ష నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
