పారాచ్యూట్ కుప్పకూలి ఓ టూరిస్ట్ మరణించిన ఘటన కులూమనాలిలో జరిగింది. విహార యాత్రకోసమని హిమాచల్ ప్రదేశ్లోని కులుకి వెళ్లిన అతడి పర్యటన విషాదాంతమైంది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో చెన్నైకి చెందిన అరవింద్ మృతి చెందారు. దొభి ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. అతనితో పాటు ఉన్న పైలట్ గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
ఈ ఘటనపై కులు ఎస్పీ గౌరవ్ సింగ్ మాట్లాడుతూ.. ఆ టూరిస్ట్ పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో బెల్టును వదులుగా కట్టుకున్నాడని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.
ఈ ఏడాది ఆగష్టు నెలలో కూడా హైదరాబాద్ కు చెందిన యువ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఇదే పరిస్థితుల్లో మరణించాడు. నాగోల్ ప్రాంతానికి చెందిన లక్కా చంద్రశేఖర్ రెడ్డి విహారయాత్ర కోసమని కులూకు వచ్చాడు. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో గాల్లోకి ఎగిరిన ప్యారాచ్యూట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మరణించాడు.