పబ్లిక్ ఏరియాల్లో బ్యానర్లు, వాల్ రైటింగ్ ఉండొద్దు : బి.గోపి

పబ్లిక్ ఏరియాల్లో బ్యానర్లు, వాల్ రైటింగ్ ఉండొద్దు :  బి.గోపి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఎలక్షన్​ కమిషన్​ఆదేశాల మేరకు జిల్లాలోని  పబ్లిక్ ప్రదేశాల్లో  బ్యానర్లు, వాల్ రైటింగ్‌‌లు లేకుండా చూడాలని జిల్లా ఎలక్షన్​ఆఫీసర్‌‌‌‌, కలెక్టర్ డాక్టర్ బి.గోపి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీపీ సుబ్బారాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్​మాట్లాడుతూ ఎన్నికల కోడ్​అమలులో ఉన్నందున జిల్లాలోని పబ్లిక్ ప్రదేశాలలో ఎక్కడా బ్యానర్లు, వాల్ రైటింగ్  లేకుండా చూడాలన్నారు.

పోస్టల్ బ్యాలెట్ 12 బీ కోసం అవసరమైన శాఖలన్నింటినీ వినియోగించుకోనున్నట్లు చెప్పారు. సెక్టోరల్  ఆఫీసర్లకు  ఎన్నికల సామగ్రిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల విధుల కోసం అన్నిశాఖలలోని కాంట్రాక్టు ఉద్యోగులు, పంచాయతీ సెక్రటరీల వివరాలను పంపించాలని ఆదేశించారు.  జిల్లాలోని 50శాతం కేంద్రాల్లో  లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామన్నారు. మిగిలిన పోలింగ్ సెంటర్లలో సీసీ టీవీ, వీడియో రికార్డింగ్స్  ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

కరెంట్​సప్లైలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఎలక్షన్స్ కోసం జిల్లాకు వచ్చే జనరల్ , వ్యయ, పోలీస్ అబ్జర్వర్ల కోసం కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  ప్రతి నియోజకవర్గం వారీగా రూట్ మ్యాప్ రెడీ చేసుకొని, అవసరమయ్యే వాహనాలను ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద దివ్యాంగుల కోసం 2 వీల్ చైర్లతో పాటు ఇద్దరు వాలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు.   1950 కాల్ సెంటర్ తో పాటు సువిధ యాప్ లో  వచ్చే సమస్యలను  డెయిలీ  రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు  ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవోలు  కె.మహేశ్వర్, రాజు, ఏసీపీ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. 

సువిధపై అవగాహన సదస్సు

సువిధ ఆన్ లైన్ యాప్‌‌పై వివిధ పార్టీల ప్రతినిధులకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్  కె.మహేశ్వర్ ఆద్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌‌‌‌వో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు  సువిధ ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థులు తమ నామినేషన్ దరఖాస్తు, సభలు, సమావేశాలు, వెహికల్ పర్మిషన్, తదితర ఎన్నికల నియమావళి పర్మిషన్లు పొందేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు  చేసుకోవచ్చన్నారు. సమావేశంలో అసిస్టెంట్ ఆర్‌‌‌‌వోలు స్వరూపరాణి, రమేశ్, నవీన్, రాజేశ్, రవీందర్, శ్రీనివాస్, జోజిరెడ్డి పాల్గొన్నారు.