గ్రౌండ్లో ట్యాంకర్ ఢీకొని ఏఎస్సై మృతి..పేట్బషీరాబాద్లో విషాదం

గ్రౌండ్లో ట్యాంకర్ ఢీకొని ఏఎస్సై మృతి..పేట్బషీరాబాద్లో విషాదం

జీడిమెట్ల, వెలుగు: పరేడ్​ కోసం వచ్చిన ఓ ఏఎస్సై వాకింగ్​ చేస్తుండగా.. వాటర్​ ట్యాంకర్​ ఢీకొట్టడంతో చనిపోయారు. పేట్  బషీరాబాద్​లో ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్​ జిల్లాలోని పెద్దేముల్​ జయరాం నగర్​తండాకు చెందిన ఆర్. దేవ్​సింగ్​(60)  పేట్​బషీరాబాద్​ పోలీస్ స్టేషన్​లో ఏఎస్సైగా పని చేస్తున్నారు. నగరంలోని అల్వాల్​లో ఉంటూ డ్యూటీ చేస్తున్నారు. శనివారం ఉదయం పీఎస్ఆర్​ గార్డెన్​లో జరిగే పరేడ్​కు పోలీసులతో పాటు వచ్చారు. 

పరేడ్​  తర్వాత గ్రౌండ్​లో వాకింగ్​ చేస్తున్నారు. అప్పుడే గార్డెన్​లోకి వచ్చిన వాటర్ ​ట్యాంకర్ ​డ్రైవర్.. ​దేవ్​సింగ్​పక్క నుంచి టర్న్​ తీసుకుంటున్నాడు. గమనించిన ఏఎస్సై పక్కకు తప్పుకున్నప్పటికీ ట్యాంకర్​ వెనుకభాగం తగలడంతో దేవ్ సింగ్  కిందపడి గాయపడ్డారు. గమనించిన తోటి పోలీసులు.. ఆయనను దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. దేవ్​సింగ్​కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పేట్​బషీరాబాద్​పోలీసులు కేసు నమోదు చేశారు.