
- ఎంపీ నగరం ఇండోర్లో నిర్మాణం
- ఏటా కొత్తగా 10 స్టోర్లను తెరుస్తాం
- ఏషియన్ పెయింట్స్ సీఈఓ అమిత్
హైదరాబాద్, వెలుగు: కంపెనీ కెపాసిటీ విస్తరణలో భాగంగా మధ్యప్రదేశ్నగరం ఇండోర్లో మరో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని ఏషియన్ పెయింట్స్ సీఈఓ అమిత్ సింగ్లే వెల్లడించారు. హైదరాబాద్లో మంగళవారం అమిగో క్లాసిక్ హోమ్ స్టూడియోను ప్రారంభించిన సందర్భంగా ‘వెలుగు’తో మాట్లాడారు. ‘‘ఈ ప్లాంటు సామర్థ్యం నాలుగు లక్షల కిలోలీటర్ల వరకు ఉంటుంది. సుమారు రూ. 2,000 కోట్లు పెట్టుబడి అవసరమని అంచనా.
మూడేళ్లలోపు ఇక్కడ ప్రొడక్షన్ మొదలవుతుంది. మాకు హైదరాబాద్సమీపంలోనూ ప్లాంటు ఉంది. కొత్తగా ప్రారంభించిన పెద్ద స్టోర్లకు పెట్టుబడి దాని స్థలం ఆధారంగా మారుతుంది. రూ. మూడు కోట్లు నుంచి రూ. ఆరు కోట్ల వరకు ఉండవచ్చు. ఈ సంవత్సరం ఇప్పటికే ఐదు స్టోర్లు తెరిచాం. ఏటా 5 నుంచి 10 స్టోర్లను దేశవ్యాప్తంగా తెరుస్తాం. కస్టమర్లు పర్యావరణ అనుకూల, బ్యాక్టీరియా తొలగించే పెయింట్స్ను కోరుకుంటున్నాం.
అందుకే మేం ఏరోప్లేన్ పెయింట్ను అందుబాటులోకి తెచ్చాం. ఇది గాలిలోని సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి శుభ్రపరుస్తుంది. నీలయా ఆర్క్ అనేది పర్యావరణ అనుకూల ఉత్పత్తి. ఆర్కిటెక్టులు, డిజైనర్లు దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈసారి వర్షాల కారణంగా డిమాండ్ కాస్త తక్కువ ఉంది. వచ్చే 3-–6 నెలల్లో పండుగ డిమాండ్ పెరగవచ్చు.
ఏషియన్ పెయింట్స్ సుమారు 40 నుంచి 50 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. యూఎస్లోని ఒక కంపెనీతో జాయింట్ వెంచర్ కూడా ఉంది”అని ఆయన వివరించారు.