ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాల్లో 8 ఫైనల్.. ఇద్దరు బీసీ, నలుగురు ఓసీలకు కాంగ్రెస్​ టికెట్లు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో  14 స్థానాల్లో 8 ఫైనల్.. ఇద్దరు బీసీ, నలుగురు ఓసీలకు కాంగ్రెస్​ టికెట్లు

మిగిలిన స్థానాల్లో అసంతృప్తులను బుజ్జగించాకే పేర్ల ప్రకటన
నలుగురు సీనియర్లతో పాటు కొత్తగా చేరిన వారికి చోటు

మహబూబ్​నగర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ హైకమాండ్ క్యాండిడేట్ల సెలక్షన్​పై ఆచుతూచి అడుగులేస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వర్గ విభేదాలు, టికెట్ల కోసం పంచాయితీలు ఉన్న చోట్ల క్యాండిడేట్లను ఫైనల్​ చేయడానికి మరో రెండు రోజుల టైం తీసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాలు ఉండగా, 8 చోట్ల క్యాండిడేట్లను ప్రకటించింది. అందులో నలుగురు కొత్తగా పార్టీలో చేరిన వారు ఉండగా, మిగిలిన నలుగురు సీనియర్​ లీడర్లు కావడం గమనార్హం. 

ఇద్దరు బీసీలు.. నలుగురు ఓసీలకు..

ఉమ్మడి జిల్లాలోని 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్​ పార్టీ​క్యాండిడేట్లను ఫైనల్​ చేసింది. కొడంగల్​ నుంచి టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, అచ్చంపేట నుంచి ఆ పార్టీ నాగర్​కర్నూల్​ డీసీసీ అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ, అలంపూర్​ నుంచి ఎస్ఏ సంపత్​కుమార్, షాద్​నగర్​ నుంచి వీర్లపల్లి శంకర్(కె.శంకరయ్య) పేర్లను ఖరారు చేసింది. బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన గద్వాల జడ్పీ చైర్​పర్సన్​ సరిత తిరుపతయ్యకు టికెట్​ ఇచ్చారు.

అలాగే కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి  కొడుకు కూచుకుళ్ల రాజేశ్​రెడ్డికి టికెట్​ కన్ఫాం చేశారు. ఇటీవల బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి వచ్చిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కొల్లాపూర్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి కల్వకుర్తి టికెట్లు కన్ఫాం చేశారు. వీటిలో అలంపూర్, అచ్చంపేట ఎస్సీకి రిజర్వ్​ కాగా.. గద్వాల, షాద్​నగర్​ సెగ్మెంట్లను బీసీలకు కేటాయించారు. మిగిలిన నాలుగు స్థానాల్లో మూడు రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి వెలమ సామాజిక వర్గానికి కేటాయించారు. అయితే, ప్రతి పార్లమెంట్​ పరిధిలో రెండు స్థానాలను బీసీలకు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించగా, పాలమూరు పార్లమెంట్​ పరిధిలో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలనే ఇక్వేషన్స్​లో భాగంగా నాగర్​కర్నూల్​ పరిధిలో బీసీలకు ఒక టికెట్​ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

నాగర్​కర్నూల్​లో ఆరు.. పాలమూరులో రెండు..

కాంగ్రెస్​ హైకమాండ్​ ఉమ్మడి జిల్లాలోని నాగర్​కర్నూల్​ పార్లమెంట్​లోని ఏడు స్థానాల్లో ఆరు చోట్ల, పాలమూరు పార్లమెంట్​ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను రెండు చోట్ల మాత్రమే క్యాండిడేట్లను ఫైనల్​ చేసింది. నాగర్​కర్నూల్​ పరిధిలోని నాగర్​కర్నూల్, కల్వకుర్తి, గద్వాల, కొల్లాపూర్​ అసెంబ్లీ సెగ్మెంట్లలో అసమ్మతి ఉన్నా.. అక్కడి లీడర్లను మేనేజ్​ చేయడంతో సమస్య సద్దుమణిగింది.

పాలమూరు పార్లమెంట్​ పరిధిలో మక్తల్, దేవరకద్ర, నారాయణపేట, మహబూబ్​నగర్, జడ్చర్లలో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండడంతో క్యాండిడేట్లను ఫైనల్​ చేయడం తలనొప్పిగా మారింది. ఇక్కడి లీడర్ల మధ్య సయోధ్య తెచ్చాకే ఎవరికి టికెట్​ ఇవ్వాలనే దానిపై క్లారిటీ రానుంది. వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, శివాసేనారెడ్డి, మేఘారెడ్డి మధ్య టికెట్​ కోసం వార్​ నడుస్తోంది. వీరిలో ఒకరికి టికెట్​ ఇచ్చి, మిగిలిన ఇద్దరిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది.

ఫస్ట్​ లిస్ట్​లో లేని జడ్చర్ల..

ఎన్నికల వేడి మొదలైనప్పటి నుంచి జడ్చర్ల టికెట్​పై సందిగ్ధత నెలకొంది. ఇక్కడి నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్​రెడ్డి, కొద్ది నెలల కింద బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్ ఎర్ర శేఖర్​ టికెట్​ ఆశిస్తున్నారు. కాగా, గత నెల వీరి మధ్య హైకమాండ్​ సయోధ్య కుదర్చిందని, జడ్చర్ల నుంచి అనిరుధ్​రెడ్డి, నారాయణపేట నుంచి ఎర్ర శేఖర్​ పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. పార్టీ రాష్ట్ర నాయకుడు మీడియా సమావేశంలో కూడా పేర్కొన్నారు. ఫస్ట్​ లిస్ట్​లో జడ్చర్ల పేరు లేకపోవడంతో ఇక్కడి పంచాది ఇంకా సద్దుమణగలేదనే ప్రచారం నడుస్తోంది.

సీనియర్ల దారెటు?

నాగర్​కర్నూల్ ​నుంచి మాజీ మంత్రి నాగం జనార్దన్​రెడ్డి, కొల్లాపూర్​ నుంచి జగదీశ్వర్​రావు కాంగ్రెస్​ టికెట్ ఆశించారు. కొత్త వారికి కాకుండా నాగంకు టికెట్​ ఇవ్వాలని ఆయన అనుచరులు హైదరాబాద్​లో టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డిని అడ్డుకున్నారు. జగదీశ్వర్​రావు కూడా టికెట్​ తనకే వస్తుందనే ధీమాలో ఉన్నారు. కానీ, ఈ రెండు స్థానాల్లో పార్టీలో కొత్తగా చేరిన రాజేశ్, కృష్ణారావు వైపు హైకమాండ్​ మొగ్గు చూపింది. దీంతో వీరు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం వీరితో ఓ పార్టీకి చెందిన లీడర్లు సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఆ పార్టీ నుంచి టికెట్లు ఇస్తామని హామీ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ ఇద్దరు కూడా ఆ పార్టీ నుంచి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు గద్వాలలో బీఆర్ఎస్​ నుంచి వచ్చిన సరితకు టికెట్​ ఇవ్వొద్దని ఢిల్లీలో నిరసన తెలిపారు. వారు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారనే చర్చ నడుస్తోంది.